logo

ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతిపై బంధువుల ఆందోళన

విద్యార్థి మృతి నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 06 Feb 2023 02:32 IST

కళాశాల వసతిగృహంలో సామగ్రి ధ్వంసం

వసతిగృహ భవనంలో ధ్వంసమైన అద్దాలు..  

ఆందోళనకారులను బయటకు పంపుతున్న పోలీసులు

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థి మృతి నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కళాశాల వసతి గృహంలో ఈనెల 4న వైఎస్సార్‌ కడప జిల్లా వేముల మండల నారేపల్లికి చెందిన ధరణేశ్వర్‌రెడ్డి (20) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. ఈక్రమంలో శనివారం అర్ధరాత్రి తరువాత విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు 30 మందిపైగా గూడూరు చేరుకున్నారు. ఆసుపత్రిలో మృతదేహం పరిశీలించిన తరువాత ఘటన జరిగిన వసతిగృహంలోని గదిని పరిశీలించారు. హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ కళాశాల యాజమాన్యంతో గొడవపడ్డారు. గదిలో అనుమానాస్పద రీతిలో మృతిచెందితే ఎలా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వసతిగృహంలోని అద్దాలు, ఫర్నిచర్‌ ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. అరగంటపాటు ఏంజరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొనగా విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గూడూరు ఒకటో పట్టణ పోలీసులు ఎంత నిలువరించినా వీలుకాకపోవడంతో మరింతమంది పోలీసులను రప్పించారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి, రెండో పట్టణ సీఐ వెంకటేశ్వరరావు విద్యార్థి బంధువులతో మాట్లాడి శాంతింపజేశారు. మృతికి సంబంధించి మీకున్న సందేహాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదుచేసి విచారణ చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో వారు వెనక్కుతగ్గారు. అనంతరం పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలలో మృతదేహానికి పరీక్షలు పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. కళాశాల యాజమాన్యమే హత్యచేసి ఆత్మహత్యగా చెప్పడం దారుణమని వైఎస్సార్‌ విద్యార్థి సంఘం నాయకుడు నిఖిల్‌ ఆరోపించారు. మృతుని కుటుంబీకులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. పలు అనుమానాలు ఉన్నాయని, సీసీ కెమెరాలు పరిశీలించాలని పోలీసులను కోరారు. బాధితుల కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై పవన్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని