logo

తెదేపా నేతపై దాడి

పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు

Published : 20 Apr 2024 03:18 IST

గాయపడ్డ సుబ్బరాజు
కల్లూరు, న్యూస్‌టుడే: పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు. ఈ మేరకు తెదేపా నాయకుడు సుబ్బరాజు కల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు... శుక్రవారం సాయంత్రం బి.వడ్డపల్లి గ్రామ సమీపంలోని మైదానంలో కొందరు పిల్లలు వాలీబాల్‌ ఆడుతున్నారు. అక్కడకు చేరుకున్న వైకాపాకు చెందిన రెడ్డప్ప, వెంకటరమణ ఇరువురు వాలీబాల్‌ నెట్‌ తమ పార్టీ వాళ్లు ఇచ్చిందని గొడవకు దిగారు. తాము వాలీబాల్‌ పోటీల్లో గెలిచి నెట్‌ తెచ్చుకొన్నామని పిల్లలు వారించారు. దీంతో మళ్లీ ఇరువర్గాల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో, ఇక్కడ తెదేపా వారు వాలీబాల్‌ ఆడకూడదని రెడ్డప్ప, వెంకటరమణ ఇరువురు వాదించారు. అక్కడే కూర్చుని ఉన్న తన తలపై రాయితో దాడి చేసి తీవ్రంగా గాయ పరచినట్లు తెదేపా నాయకుడు సుబ్బరాజు ఫిర్యాదులో వివరించారు.


ప్యాసింజర్‌ ఆటోను ఢీకొన్న కారు

 8 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

 పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆటోను వెనుక నుంచి కారు ఢీ కొనడంతో 8 మంది కూలీలు గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని జిల్లా సరిహద్దులో శుక్రవారం సాయంత్రం జరిగింది. పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామానికి చెందిన 14 మంది అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మినికి గ్రామంలోని రైతు కుమార్‌కు చెందిన టమాటా చెట్లకు పుర్ర కట్టేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారు అతి వేగంగా వచ్చి వెనుక నుంచి రెండు సార్లు ఢీ కొంది. దీంతో ఆటో రోడ్డుపై మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న మునెమ్మ (65)కు తలకు బలమైన గాయమైంది. సుజాత (45)కు తీవ్ర గాయాలవడంతో మదనపల్లెకు తరలించారు. పుట్టమ్మ (45), గాయత్రి (32), పెద్దరెడ్డిమ్మ (46), వైశాలి (18), నాగవేణి (22), జ్యోతి (34), పద్మావతి (45), పార్వతమ్మ (60)కు ఎముకలు, నడుము, కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, సర్పంచి ఆంజప్ప పరామర్శించారు.


రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

రామకుప్పం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. మండలంలోని మిట్టపల్లికి చెందిన సోమశేఖర్‌ ఈనెల 14న తన తండ్రిని వి.కోటలో విడిచిపెట్టి స్వగ్రామానికి వస్తుండగా కెంపసముద్రం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి కుప్పం ఆస్పత్రికి తరలించారు. సోమశేఖర్‌ చికిత్స తీసుకుంటూ శుక్రవారం మృతి చెందాడు. సోమశేఖర్‌ భార్య హాజీరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని