logo

కేసీ.. జగన్‌ నిర్లక్ష్యం చేసి

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్‌ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్‌’ తేల్చింది..

Updated : 24 Apr 2024 06:00 IST

కాల్వ ఆధునికీకరణకు నిధులివ్వని సర్కారు
బీడుగా మారిన వేల ఎకరాలు
కీలకమైన అలగనూరును వదిలేశారు
న్యూస్‌టుడే, కర్నూలు జలమండలి, కర్నూలు గ్రామీణ

‘‘ నాన్న సీఎంగా ఉన్న కాలంలో కర్నూలు-కడప (కేసీ) కెనాల్‌ ఆయకట్టు మొత్తానికి నీరు అందేది.. రెండు కార్ల పంటలు పండేవి.. చంద్రబాబు పాలనలో కేసీ ఆయకట్టు సాగు తగ్గిపోతోంది.. అభివృద్ధి అంటే నిన్నటి కంటే ఈరోజు బాగుండటం.. ఇప్పుడు మాత్రం వెనకడుగు వేస్తున్నాం..!!

ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా 2017 నవంబరు 14న చాగలమర్రి మండలం ముత్యాలపాడు బస్టాండులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ మాటలివి.!!


ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్‌ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్‌’ తేల్చింది.. పదేపదే రైతు పక్షపాతిగా చెప్పుకొనే జగన్‌.. కేసీ కాల్వను గాలికొదిలేశారు.. తన సొంత జిల్లా ప్రజలకు నీటిని అందిస్తున్నా పైసా ఇవ్వలేదు.. నీరు పారే కాల్వలు ఛిద్రం కావడంతో ఆయకట్టు బీళ్లుగా మారింది. కాల్వ పరిధిలో సాగయ్యే ‘సోనా’ రకం వరి ప్రమాదంలో పడింది.!!

గేట్ల వద్ద పరిస్థితి


చరిత్ర తెలుసా జగన్‌

బ్రిటిష్‌ హయాంలో నౌకాయానం కోసం కేసీ కెనాల్‌ నిర్మించారు. కర్నూలు జిల్లా సుంకేసుల ఆనకట్ట నుంచి మొదలై 304 కి.మీ పొడవుతో వైఎస్సార్‌ జిల్లాలోని కృష్ణాపురం వరకు ప్రవహిస్తుంది. సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ సలహా ప్రకారం వ్యవసాయ భూములకు నీటి సదుపాయాన్ని కల్పించేందుకు ఉపయోగించాలని నిర్ధారించారు.  ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల పరిధిలో ఖరీఫ్‌ రబీ పంటలకు ఏడాదిలో ఎనిమిది నెలల పాటు 31.90 టీఎంసీల నీటిని 2,65,628 ఎకరాలకు నీరు ఇవ్వాలి. కాల్వ పొడవునా ఎక్కువగా వరి సాగు చేస్తారు.


మొదటి 40 కి.మీ అస్తవ్యస్తం

  • కేసీ ప్రధాన కాల్వ సామర్థ్యం 3,850 క్యూసెక్కులు. పూర్తి సామర్థ్యంతో నీటిని వదిలితే తెగిపోయే ప్రమాదముందన్న ఉద్దేశంతో అధికారులు ప్రస్తుతం 2,100 క్యూసెక్కులు మించి వదలడం లేదు. దీనిని అధిగమించేందుకు ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాలు వినియోగిస్తున్నారు. వీటిని వినియోగిస్తున్న కారణంగా నిత్యం రూ.4 లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇది అదనపు భారంగా మారింది.
  • సుంకేసుల జలాశయం (0 కి.మీ) నుంచి 40 కి.మీ వరకు ఇరువైపులా కట్టలు నెర్రలు బారాయి. లైనింగ్‌ కుంగి దెబ్బతింది. మట్టి పేరుకుపోయింది. స్లూయిజ్‌, షట్టర్లు దెబ్బతిన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరు, శాతనకోట, మల్యాల, పగిడ్యాల, జూపాడుబంగ్లా పరిధిలో లైనింగ్‌ పూర్తిగా దెబ్బతింది. కొన్నిచోట్ల లైనింగ్‌ పూర్తిగా కొట్టుకుపోయింది.

ఆర్‌.కొంతలపాడు, దుద్యాల ప్రాంతంలో కాల్వ పరిస్థితి


కదలని కాసుల దస్త్రం

  • 2009లో వచ్చిన వరదలకు కేసీ కాల్వ చాలాచోట్ల దెబ్బతింది. అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. శాశ్వత పనులు చేపట్టేందుకు రూ.124 కోట్లు ఖర్చవుతాయని అధికారులు తేల్చారు. పలుమార్లు ప్రతిపాదనలు పంపినా పాలకులు పట్టించుకోవడం లేదు.
  • ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) నిధులతో ఆధునికీకరణ చేపట్టాలని నిర్ణయించారు. సుంకేసుల జలాశయం అభివృద్ధి, ప్రధాన కాల్వకు ఇరువైపులా లైనింగ్‌కు మరమ్మతులు, కొన్నిచోట్ల శాశ్వత నిర్మాణాలు వంటి పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. కేంద్రం రూ.514.40 కోట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రం వాటా విడుదల చేయకపోవడంతో ‘నిధుల’ ప్రవాహం ఆగింది. రాష్ట్రం చొరవ తీసుకుని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌తో సంప్రదించాల్సి ఉండగా ఆ దిశగా అడుగులు వేయలేదు.

చంద్రన్న కట్టారు

కేసీ ఆయకట్టుకు వేసవిలో నీటిని ఇచ్చేందుకు అలగనూరు జలాశయానికి రూపకల్పన చేశారు. దీనికి 1985 నవంబరు 11న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో అనుమతులు ఇచ్చారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీనికి 3,585 ఎకరాలు సేకరించారు. రూ.59.7 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. 7.50 కి.మీ. మట్టికట్ట నిర్మించారు. 2005లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ జలాశయాన్ని ప్రారంభించారు. ఇందులో 2.965 టీఎంసీలు నిల్వ చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేవారు.


జగనన్న కూల్చారు

నాలుగేళ్ల కిందట జలాశయం కట్ట కుంగిపోయింది. వైకాపా ప్రభుత్వం నీటి నిల్వను ఆపేసింది. మరమ్మతుల పేరుతో 20 మీటర్ల కట్ట తొలగించింది. పనుల కోసం రూ.3.20 కోట్లు మంజూరు చేసింది. గుత్తేదారు పనులు చేపట్టినా బిల్లులు అందక మధ్యలో వదిలేశారు. పనుల్లో జాప్యం కావడంతో మట్టి కట్ట తొలగించిన ప్రాంతం నుంచి సుమారు 500 మీటర్ల వరకు మళ్లీ కట్ట కుంగిపోయింది. మొత్తం మరమ్మతులకు రూ.24 కోట్లు కావాలంటూ అధికారులు మళ్లీ ప్రతిపాదనలు పంపారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఆయకట్టు పొలాలు బీడుగా మారాయి. జలాశయం సమీపంలోని అలగనూరు, తలముడిపి, రోళ్లపాడు, కొర్రపోలూరు గ్రామాలకు చెందిన సుమారు 200 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవనం సాగించేవారు.

శిథిలావస్థలో కాల్వగట్టు 


31.90 టీఎంసీలు కేటాయింపు

  • బచావత్‌ అవార్డు ప్రకారం తుంగభద్ర నుంచి 10 టీఎంసీలు, నదీ ప్రవాహ జలాలు 21.90 టీఎంసీలు కేటాయించారు. సుంకేసులలో 1.20 టీఎంసీలు నిల్వ చేసి ప్రధాన కాలువకు విడుదల చేస్తున్నారు. కేసీ కాలువకు 31.90 టీఎంసీల నీటి వాటాను కృష్ణా జల వివాదాల పరిష్కార సంస్థ (కేడబ్ల్యూడీటీ) కేటాయించింది. తుంగభద్ర జలాశయం ద్వారా 10 టీఎంసీలు.. మిగిలినవి నది ద్వారా (వరద జలాలు) తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, కల్లూరు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, వెలుగోడు, గడివేముల, బండి ఆత్మకూరు, మహానంది, నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు మండలాల పరిధిలో 259 గ్రామాలకు చెందిన రైతులు పంటలు సాగు చేస్తున్నారు.

చివరికి చేరని నీరు

  • ప్రధాన కాల్వ 60 కి.మీ దాటిన తర్వాత లైనింగ్‌ పలుచోట్ల దెబ్బతింది. మల్యాల నుంచి ముచ్చుమర్రి వరకు అధ్వానంగా ఉంది. పలుచోట్ల పగుళ్లు వచ్చాయి.. కొన్నిచోట్ల భారీగా కుంగిపోయింది.. కాలువకు ఇరువైపులా ముళ్లపొదలు దట్టంగా పెరిగాయి.
  • నందికొట్కూరు నియోజకవర్గం శాతనకోట-మల్యాల మధ్యలో విద్యుత్తు మోటార్లు వేసుకుని నీటిని తీసుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
  • కాల్వ అడుగుభాగం (బెడ్‌) దెబ్బతిని బురద మేట వేసింది. చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు నిండిపోయాయి. సాగు నీటి కాలువ మురుగుమయంగా మారింది.
  • చాగలమర్రి సమీపంలో పంట కాల్వ ఆనవాళ్లు కోల్పోయింది. నీరు అందక దాదాపు రెండు వేల ఎకరాలు బీళ్లుగా మారింది. కాల్వ పొడవునా పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

ఏటా రూ.168 కోట్ల నష్టం

కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలో రెండో పంటకు నీరందకపోవడంతో సుమారు 56 వేల ఎకరాల్లో పంటలు సాగవ్వడం లేదు. ఎకరాకు రూ.30 వేల ప్రకారం ఏటా రూ.168 కోట్ల మేర ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని