భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్‌ ఏం చెప్పింది.. మీరేం చేశారు?

ల్యాండ్‌ టైటిలింగ్‌ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది.

Updated : 06 May 2024 09:40 IST

పౌరుల ఆస్తులకు ఎసరు పెట్టేలా రూపకల్పన
జిల్లా జడ్జితో ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయని వైనం
టీఆర్‌వోగా అధికారిని నియమించమంటే ఏ ‘వ్యక్తినైనా’ నియమించొచ్చంటారా?

ఈనాడు, అమరావతి: ల్యాండ్‌ టైటిలింగ్‌ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. పౌరుల స్థిరాస్తులకు ఎసరు పెట్టేలా.. నచ్చిన విధంగా ఈ చట్టాన్ని రూపొందించుకుంది. ప్రభుత్వ పెద్దలు మాత్రం అది కేంద్రం సూచించిన చట్టం, మాదేం తప్పులేదన్నట్లు ఊదరగొడుతున్నారు. నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిన నమూనా టైటిలింగ్‌ చట్టం.. సీఎం జగన్‌ సర్కారు తెచ్చిన యాక్ట్‌ను పక్కన పెట్టుకొని అధ్యయనం చేస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. దేశంలో ఈ చట్టాన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని వైకాపా గర్వంగా చెబుతోంది. అలాంటప్పుడు నీతి ఆయోగ్‌ నమూనా చట్టం స్ఫూర్తికి ఎందుకు తూట్లు పొడిచారనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏమి సూచించింది. జగన్‌ ప్రభుత్వం ఎలాంటి చట్టాన్ని తెచ్చిందో పరిశీలిద్దాం.


వెంటనే రద్దు చేయాలి..

- సీనియర్‌ న్యాయవాది నీలం రామమోహన్‌రావు, టైటిలింగ్‌ యాక్ట్‌పై గుంటూరు జిల్లా కార్యక్రమాల సమన్వయకర్త

‘ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అత్యంత దుర్మార్గమైన చట్టం. ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను అధికారంలో ఉన్నవాళ్లు కొట్టేయడానికి అనువుగా దీన్ని తెచ్చారు. నీతి ఆయోగ్‌ సూచించిన ఆంశాలను తీసేసి.. వైకాపా ప్రభుత్వం వాళ్లకు అనుకూలంగా జోడించుకొని ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలి’


నీతి ఆయోగ్‌ నమూనా టైటిలింగ్‌ చట్టం                                    

1) సెక్షన్‌ 5 ప్రకారం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (టీఆర్‌వో)గా ఏ అధికారినైనా నియమించొచ్చు
2) టైటిల్‌ వివాదం ఉన్నట్లు టీఆర్‌వో గుర్తిస్తే.. సెక్షన్‌ 10 కింద వివాదాల రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేసి ల్యాండ్‌ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ ఆఫీసర్‌ (ఎల్‌డీఆర్‌వో) వద్దకు పంపాలి
3) ఎల్‌డీఆర్‌వో ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎల్‌టీఏటీ)ను ఆశ్రయించేందుకు సెక్షన్‌ 15 వెసులుబాటు ఇస్తుంది. సెక్షన్‌ 36 ప్రకారం ఈ ట్రైబ్యునళ్లకు జిల్లా జడ్జి ర్యాంక్‌ కలిగిన జ్యుడిషియల్‌ అధికారి లేదా విశ్రాంత జ్యుడిషియల్‌ అధికారి నేతృత్వం వహించాల్సి ఉంటుంది. న్యాయశాస్త్రం తెలిసిన జ్యుడిషియల్‌ అధికారితో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో అప్పీలేట్‌ ట్రైబ్యునళ్లను నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేయమంది.
4) రికార్డుల్లో యజమాని పేర్లను ఓసారి చేర్చి నోటిఫై చేశాక.. ‘మూడేళ్ల’లోపు ఎవరు అభ్యంతరం చెప్పకపోతే యాజమాన్య హక్కు విషయంలో ఈ వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించొచ్చు.
5) ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సెక్షన్‌ 16 ప్రకారం హైకోర్టులో ‘అప్పీల్‌’ దాఖలు చేసుకోవచ్చు.
6) టైటిలింగ్‌ రిజస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (టీఆర్‌వో) తర్వాత భూ యాజమాన్య హక్కు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు నమూనా టైటిలింగ్‌ చట్టం ‘మూడు అంచెల’ వ్యవస్థను సిఫార్సు చేసింది.1 ల్యాండ్‌ డిస్‌ప్యూట్‌ రెజుల్యూషన్‌ ఆఫీసర్‌. 2 ల్యాండ్‌  టైటిలింగ్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌. 3 హైకోర్టులో అప్పీల్‌.
7) జిల్లా జడ్జి నేతృత్వం వహించే ట్రైబ్యునల్‌కు, అధికారికి తప్పుడు సమాచారం ఇచ్చినా.. దాచినా, ఇవ్వకపోయినా సంబంధిత వ్యక్తికి సెక్షన్‌ 62 ప్రకారం మూడేళ్ల వరకు జైలుశిక్ష లేదా రూ.50వేల జరిమానా లేదా రెండింటికీ బాధ్యులవుతారు.


జగన్‌ ప్రభుత్వం తెచ్చిన ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం

1) సెక్షన్‌ 5 ప్రకారం టీఆర్‌వోగా ఏ వ్యక్తినైనా నియమించొచ్చు. ఇందులోనే కుట్ర కోణముంది.
2) ఇందులో ఎల్‌డీఆర్‌వో ప్రస్తావనే లేదు. ఆ నియమకానికి పాతరేశారు. నేరుగా ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ ఆఫీసర్‌ని ఆశ్రయించాలని పేర్కొన్నారు.  
3) ఈ చట్టంలో సెక్షన్‌ 36ప్రకారం అప్పీలేట్‌ ట్రైబ్యునళ్ల ఊసేలేదు. ట్రైబ్యునళ్ల స్థానంలో ఆయా జిల్లా సంయుక్త కలెక్టర్‌ హాదాకు తగ్గని అధికారిని లేదా విశ్రాంత అధికారిని ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ ఆఫీసర్‌ (ఎల్‌టీఏవో)గా నియమించారు. అప్పీలేట్‌ ట్రైబ్యునళ్లకు పాతరేసి.. సంయుక్త కలెక్టర్‌ స్థాయిలో అప్పీలేట్‌ అధికారిని మాత్రమే నియమించుకునేందు వీలు కల్పించారు.
4) రికార్డుల్లో నమోదైన యాజమాన్య హక్కుపై అభ్యంతరం వ్యక్తంచేసే గడవును ఈ చట్టంలో ‘రెండేళ్లకు’ (సెక్షన్‌ 13) కుదించారు. తర్వాత ఆ వివరాలను తిరుగులేనిసాక్ష్యంగా పరిగణించొచ్చు.
5) హైకోర్టులో ‘అప్పీల్‌’కు అవకాశం ఇవ్వలేదు. సెక్షన్‌ 16 కింద కేవలం ‘రివిజన్‌’ మాత్రమే దాఖలు చేసుకోవాలి.
6) ఈ చట్టం ద్వారా వివాదం పరిష్కరించుకునేందుకు కేవలం రెండంచెల వ్యవస్థకే పరిమితం చేశారు. టీఆర్‌వో తర్వాత 1. ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ అధికారి/సంయుక్త కలెక్టర్‌. 2 హైకోర్టులో రివిజన్‌కు అవకాశం కల్పించారు.
7) ఈ చట్టంలో ‘అథారిటీ’కి తప్పుడు సమాచారం ఇచ్చినా.. ఇవ్వకపోయినా ‘అధికారులే’ సంబంధిత వ్యక్తికి 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50వేల జరిమానా లేదా రెండింటినీ విధించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని