logo

పచ్చబొట్టు ఆధారంగా వీడిన మహిళ హత్య మిస్టరీ

రెండు నెలల క్రితం చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులో గుర్తుపట్టలేని స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసు మిస్టరీని ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగానే ఛేదించామని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

Published : 29 Jan 2023 04:34 IST

మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, చిత్రంలో
నిందితుడు(ముసుగులో) , డీఎస్పీ నాగభూషణం, అధికారులు

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: రెండు నెలల క్రితం చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులో గుర్తుపట్టలేని స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసు మిస్టరీని ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగానే ఛేదించామని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. డబ్బు విషయంలోనే ఈ హత్య జరిగినట్లు వివరించారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం రామన్నగూడెం వాసి సామ జయమ్మ(60) తన భర్తతో గొడవ పడి కొన్నేళ్లుగా పిల్లలతో కలిసి సూర్యాపేట పట్టణంలో నివాసం ఉంటున్నారు. బీవీ కాలనీకి చెందిన ఆర్టీసీలో ఒప్పంద డ్రైవర్‌గా పనిచేస్తున్న కొరిపెల్లి సైదులుతో చనువుగా ఉండేవారు. నెలలో తిరిగి చెల్లిస్తానని కొద్ది రోజుల క్రితం జయమ్మ వద్ద సైదులు రూ.90 వేలు అప్పుగా తీసుకున్నాడు. గడువులోగా డబ్బు ఇవ్వకపోవడంతో వారి మధ్య తరచూ గొడవ జరిగేది. గతేడాది నవంబరు 17న ఆమెను సైదులు ద్విచక్ర వాహనంపై తీసుకొని దురాజ్‌పల్లి శివారులోని ఆదర్శ పాఠశాల వెనక చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగి డబ్బుల విషయంలో ఘర్షణ పడ్డారు. దీంతో జయమ్మను ఛాతిపై సైదులు బలంగా కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో చీరను మెడకు చుట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. రెండు రోజుల తర్వాత స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె చేతిపై గల పచ్చబొట్టు, వస్త్రాలు, చెప్పుల ఆధారంగా ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.  ఆర్టీసీ బస్సులు, ఆటోలకు పోస్టర్లూ అంటించారు. మృతురాలి కుమారుడు ఇటీవల ఆటోపై వేసిన పోస్టర్‌ను చూసి చేతిపైగల పచ్చబొట్టును గుర్తుపట్టారు. రెండు నెలలుగా తన తల్లి కనిపించడం లేదని తెలిపారు. ఆమె ఫోను నంబరు ఆధారంగా దర్యాప్తు చేయడంతో కొరిపెల్లి సైదులుతో పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం అంగీకరించాడని ఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు సైదులును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. కేసు దర్యాప్తులో కష్టపడి పనిచేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు పురస్కారం అందజేశారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, గ్రామీణ సీఐ సోమ్‌ నారాయణసింగ్‌, తుంగతుర్తి సీఐ నాగార్జున, చివ్వెంల ఎస్సై విష్ణుమూర్తి, పెన్‌పహాడ్‌ ఎస్సై శ్రీకాంత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని