logo

బదిలీల్లో ఇష్టారాజ్యం

విశాఖ రీజియన్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో ‘బదిలీలలు’ విస్తు గొలుపుతున్నాయి. అవినీతి నిరోధక శాఖ (అనిశా) తనిఖీల నేపథ్యంలో ఇటీవల ఓ సబ్‌రిజిస్ట్రార్‌ను పనిచేస్తున్న కార్యాలయం నుంచి మార్చారు.

Published : 08 Jun 2023 03:27 IST

రిజిస్ట్రేషన్ల శాఖలో అర్ధరాత్రి మారిన ఉత్తర్వులు
ఈనాడు, విశాఖపట్నం

విశాఖ రీజియన్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో ‘బదిలీలలు’ విస్తు గొలుపుతున్నాయి. అవినీతి నిరోధక శాఖ (అనిశా) తనిఖీల నేపథ్యంలో ఇటీవల ఓ సబ్‌రిజిస్ట్రార్‌ను పనిచేస్తున్న కార్యాలయం నుంచి మార్చారు.

తాజా బదిలీల్లో మళ్లీ అదే కార్యాలయంలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఇందుకోసం అర్ధరాత్రి అత్యవసర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ తక్షణమే... తెల్లవారగానే సదరు అధికారి విధుల్లో చేరిపోయారు. ఆ సబ్‌రిజిస్ట్రార్‌ వచ్చి బాధ్యతలు చేపట్టే వరకు ఉత్తర్వులు మారాయన్న విషయం ఆ శాఖలో చాలా మందికి తెలియదు.

ఈ బదిలీ వెనుక ఉత్తరాంధ్రలోని ఓ మంత్రి చక్రం తిప్పారన్న చర్చ సాగుతోంది. అలాగే ఐజీ కార్యాలయం నుంచి సూచనలు వచ్చాయని సమాచారం.

అంతా చకచకా..

విశాఖలోని సూపర్‌బజార్‌ జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చే వాటిలో ఒకటి. ఏటా రూ.200 కోట్లకు పైగా ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కార్యాలయానికి కేవలం పది రోజుల వ్యవధిలో పలుమార్లు సబ్‌రిజిస్ట్రార్లను ఉన్నతాధికారులు మార్చేయడం గమనార్హం. ఈ కార్యాలయంలో ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్లు... జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌-1, 2లుగా ఉంటారు. కొద్ది నెలల కింద సాగిన బదిలీల్లో జాయింట్‌-2గా కె.శ్రీనివాసులు, జాయింట్‌-1గా మరొకరిని ఉన్నతాధికారులు ఇక్కడ నియమించారు. గత నెలలో సూపర్‌బజార్‌ కార్యాలయంలో అనిశా తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల సమయంలో కార్యాలయం లోపల ఉన్న కొందరి వద్ద నగదు బయటపడింది. అలాగే శ్రీనివాసులు ఫోన్‌కి ఇతరుల నుంచి కొంత మొత్తం డిజిటల్‌ పేమెంట్‌ అయినట్లు అనిశా అధికారులు గుర్తించారు.

* తనిఖీల తరువాత ఉన్నతాధికారులకు అనిశా నివేదిక పంపింది. అనిశా తనిఖీలు జరిగిన చోట సబ్‌రిజిస్ట్రార్లను మార్చే ప్రక్రియ గతం నుంచి ఉన్నందున ఈ కార్యాలయ సబ్‌రిజిస్ట్రార్లను డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. రాజాం, పొందూరులో పనిచేస్తున్న వారిని ఇక్కడికి మార్చారు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలకు ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన నేపథ్యాన్ని తాజా బదిలీలకు అనుకూలంగా మార్చుకున్నారనే చర్చ సాగుతోంది.

* రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ కార్యాలయం ఆదేశాల మేరకు గత నెల 31న జోన్‌-1లో డీఐజీ బాలకృష్ణ ఆరుగురు సబ్‌రిజిస్ట్రార్లను బదిలీచేశారు. ఆ సమయంలో సబ్‌రిజిస్ట్రార్‌ కె.శ్రీనువాసులను పొందూరు సబ్‌రిజిస్ట్రార్‌గా నియమించారు. సూపర్‌బజార్‌ కార్యాలయానికి రవిశంకర్‌ శేష్‌ను బదిలీ చేశారు. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ఉత్తర్వులు రాత్రికి రాత్రి మారిపోయాయి. పరిపాలనా సౌలభ్యం కోసం మార్చుతున్నట్లు పేర్కొని వెంటనే అమల్లోకి వస్తాయని సరికొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పొందూరు సబ్‌రిజిస్ట్రార్‌గా శ్రీనివాసులు బదిలీని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన్ను సూపర్‌బజార్‌ కార్యాలయానికి బదిలీ చేసి... రవిశంకర్‌ శేష్‌ని పొందూరుకు బదలీ చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 1న సూపర్‌బజార్‌ కార్యాలయం జాయింట్‌-2గా కె.శ్రీనివాసులు బాధ్యతలు తీసుకున్నారు.

* సూపర్‌బజార్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అనిశా తనిఖీల తరువాత ఒక సబ్‌రిజిస్ట్రార్‌ను మార్చినట్లే మార్చి... మళ్లీ అక్కడే పోస్టింగు ఇవ్వడం.. అదే సమయంలో ఇక్కడ పని చేసిన మరో అధికారి విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని