logo

వైద్యుల నియామకంలో అక్రమాలు!

జిల్లాలో నూతనంగా ప్రారంభించిన పల్లె దవాఖానాల కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులను ఇటీవల భర్తీ చేశారు.

Updated : 04 Dec 2022 06:21 IST

ఎంఎల్‌హెచ్‌పీల నియామక కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులు (పాత చిత్రం)

జనగామటౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో నూతనంగా ప్రారంభించిన పల్లె దవాఖానాల కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులను ఇటీవల భర్తీ చేశారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. ఎంపిక కమిటీ..  ఉద్యోగుల నియామకంలో సరైన మార్గదర్శకాలను పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అసలు ఏం జరిగిందంటే....

పల్లె దవాఖానాల్లో వైద్యుల నియామకానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా, డీఎంహెచ్‌వో కన్వీనర్‌గా ఇతర అధికారులతో ఎంపిక కమిటీని ఏర్పాటు చేశారు. 32 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ ఉద్యోగాల కోసం ఎంబీబీఎస్‌, బీఎంఎంఎస్‌, బీఎస్సీ (నర్సింగ్‌) చదివిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. బీఏఎంఎస్‌ కోర్సు చేసిన సుమారు 80 మంది దరఖాస్తు చేసుకోగా, బీఎస్సీ (నర్సింగ్‌) చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పల్లె దవాఖానాల్లో వైద్యులుగా పని చేయడానికి బీఏఎంఎస్‌ చేసిన వారికి తొలి ప్రాధాన్యమివ్వగా, తర్వాతి ప్రాధాన్యాన్ని బీఎస్సీ (నర్సింగ్‌) అభ్యర్థులకు ఇచ్చారు. నవంబర్‌ 14న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో బీఏఎంఎస్‌ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. మరుసటి రోజు వారికి పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదంతా ఒకే రోజు జరగాల్సిన ప్రక్రియ. 14వ తేదీ రాత్రి వరకు కౌన్సెలింగ్‌ జరగడంతో మరుసటి రోజు నియామక ఉత్తర్వులు  ఇచ్చారు. ఎంపికైన బీఏఎంఎస్‌ అభ్యర్థుల్లో ఐదుగురు ఉద్యోగాల్లో చేరకపోవడంతో.. సదరు ఖాళీలను బీఎస్సీ (నర్సింగ్‌) చదివిన ఐదుగురు అభ్యర్థులతో భర్తీ చేశారు. దీంతో అధికారుల తీరుపై పలువురు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎంపికపై అనుమానాలు  

ఎంఎల్‌హెచ్‌పీ ఉద్యోగాలకు సుమారు 80 మంది బీఏఎంఎస్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం కౌన్సెలింగ్‌కు ఐదుగురు రాలేదని బీఎస్సీ (నర్సింగ్‌) అభ్యర్థులను తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని పలువురు అంటున్నారు. అవసరమైతే తొలుత దరఖాస్తు చేసుకున్న బీఏఎంఎస్‌ అభ్యర్థుల్లో ప్రతిభ ప్రాతిపదికన తీసుకునే వెసులుబాటు ఉంది. ఇదే సమయంలో ఇతర జిల్లాల నుంచి స్థానికేతరులుగా దరఖాస్తు చేసుకున్న వారిలో ఐదుశాతం చొప్పున కనీసం రెండు పోస్టుల్లో బీఏఎంఎస్‌ అభ్యర్థులను తీసుకునే వీలు ఉంది. ఈ రెంటినీ కాదని బీఎస్సీ నర్సింగ్‌ అభ్యర్థులను ఎలా తీసుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొందరు అధికారులు డబ్బులు తీసుకొని బీఎస్సీ (నర్సింగ్‌) అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై సాధారణ ఉద్యోగిగా పని చేస్తున్న ఒకరిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయం అంతా ఆయన కనుసన్నల్లో నడుస్తోందని, ఉన్నతాధికారులకు, బయట వ్యవహారాలకు ఆయన సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్‌ స్పందించి బీఎస్సీ (నర్సింగ్‌) అభ్యర్థులను ఎంఎల్‌హెచ్‌పీలుగా  నియమించిన వ్యవహారంపై విచారణ చేపట్టాలని, అర్హులకు న్యాయం చేయాలని మిగతా అభ్యర్థులు కోరుతున్నారు.
నిబంధనల ప్రకారమే భర్తీ చేశాం: డాక్టర్‌ మహేందర్‌, జిల్లా వైద్యాధికారి
ఎంఎల్‌హెచ్‌పీ ఉద్యోగాలకు తొలుత బీఏఎంఎస్‌ అభ్యర్థులు ఎంపికయ్యారు. ఐదుగురు విధుల్లో చేరకపోవడంతో బీఎస్సీ (నర్సింగ్‌) అభ్యర్థులకు తర్వాతి ప్రాధాన్యమిచ్చాం. నాన్‌లోకల్‌ కేటగిరీ  పాటించాలని మా ఉన్నతాధికారులు ఎక్కడా చెప్పలేదు. నిబంధనల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని