logo

Murder: అనుమానం పెనుభూతమై!.. వివాహిత దారుణహత్య

ప్రశాంత వాతావరణానికి నెలవైన పెనుగొండలో వివాహిత హత్య కలకలం రేపింది. పోలీసులు తొలుత గుర్తుతెలియని మహిళగా దర్యాప్తు చేపట్టినా కొద్ది సేపటికే ఆమె వివరాలు తెలుసుకున్నారు.

Updated : 01 Nov 2023 08:10 IST

పెనుగొండ, మార్టేరు, న్యూస్‌టుడే: ప్రశాంత వాతావరణానికి నెలవైన పెనుగొండలో వివాహిత హత్య కలకలం రేపింది. పోలీసులు తొలుత గుర్తుతెలియని మహిళగా దర్యాప్తు చేపట్టినా కొద్ది సేపటికే ఆమె వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెనుగొండ - దేవ ఆర్‌అండ్‌బీ మార్గంలోని అడ్డపుంత పంట కాలువలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడి చేరుకుని పరిశీలించగా మృతదేహం బోర్లా పడి ఉండటం, దుస్తులు చిరిగి ఉండటంతోపాటు గాయాలు ఉండటంతో వెంటనే అప్రమత్తమయ్యారు. మృతదేహాన్ని గట్టుకు చేర్చి వివాహితగా గుర్తించి, ఎవరనే దానిపై ఆరా తీశారు.

పెనుగొండ మండలం దొంగరావిపాలెం గ్రామానికి చెందిన నందిని(25)గా గుర్తించారు. పదునైన ఆయుధంతో ఆమె వీపు, ఎడమ జబ్బ, ఛాతిపై పొడిచి హత్యచేసిన అనంతరం పంట పొలాల మధ్య ఉన్న కాలువలో పడేసినట్లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కొంత పెనుగులాట జరగడంతో ఆమె వీపుపై ఉన్న దుస్తులు చిరిగిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఎస్పీ యు.రవిప్రకాశ్‌, నరసాపురం డీఎస్పీ రవిమనోహరచారి ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను సేకరించారు. వీఆర్వో లక్కవరపు ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు సీఐ జీవీవీ.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌ తెలిపారు. డాగ్‌ స్క్వాడ్‌తో ఘటనా స్థలంలో తనిఖీలు చేశారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రేమించి పెళ్లి చేసుకుని..

నందిని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో తల్లి వద్ద ఉంటున్న సమయంలో కొఠాలపర్రు గ్రామానికి చెందిన చివటం రాంప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వీరు 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి 18 నెలల బాబు దేవాంత్‌ ఉన్నాడు. ప్రస్తుతం పెనుగొండలో నివసిస్తున్న రాంప్రసాద్‌ పెయింటింగ్‌ పని చేస్తుండగా నందిని గృహణి. కుమారై హత్య సమాచారం తెలుసుకున్న తల్లితోపాటు బంధువులంతా స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని బోరున విలపించారు.

గౌరీపట్నం వెళ్దామని చెప్పి..

సోమవారం రాత్రి గౌరీపట్నంలోని తల్లి వద్దకు వెళ్దామని చెప్పి నందినిని బయటకు తీసుకొచ్చిన భర్త రాంప్రసాద్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు పడుతున్నారు. సోమవారం ఉదయం తణుకు వచ్చిన అత్తగారిని కలిసిన రాంప్రసాద్‌ తన భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ చెప్పగా ఆమె సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. ఈలోగా క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని భావిస్తున్నారు. ఈ హత్య ఉదంతంలో భర్తతోపాటు మరెవరన్నా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. భర్త రాంప్రసాద్‌ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని