Israel: యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!

యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు (Sperm Retrieval) బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు.

Published : 09 Nov 2023 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడి భీకర యుద్ధానికి (Israel Hamas Conflict) దారితీసింది. ఇజ్రాయెల్‌లో 1400 మంది చనిపోగా.. గాజాలోనూ 10వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు (Sperm Retrieval) బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో చనిపోయిన విషయం తెలిసిన వెంటనే వారు వైద్య నిపుణులను సంప్రదిస్తున్నారు. తాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి 33 మంది నుంచి సేకరించినట్లు స్పెర్మ్‌ బ్యాంక్‌లు (Sperm Bank) వెల్లడించాయి. ఈ క్రమంలో దీనిలో ప్రస్తుతమున్న కొన్ని నిబంధనలను కూడా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తాజాగా సడలించడం గమనార్హం.

ఏమిటీ పీఎస్‌ఆర్‌..?

భవిష్యత్తులో గర్భధారణకు వీలుగా మరణించిన వ్యక్తి నుంచి వీర్య కణాలను (Spermatozoa) సేకరిస్తారు. ఈ విధానాన్నే మరణాంతర వీర్య సేకరణ (Posthumous Sperm Retrieval)గా పేర్కొంటారు. వ్యక్తి మరణించిన 24 నుంచి 36 గంటల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం వాటిని అతిశీతల ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు ఇంట్రాసైటోప్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజెక్షన్‌ (ఐవీఎఫ్‌ తరహా ) విధానంలో గర్భధారణకు ప్రయత్నిస్తారు. అయితే, ఆ వీర్యం మరణించిన లేదా సజీవంగా ఉన్న వారి నుంచి సేకరించినా ఐవీఎఫ్‌ విజయావకాశాలు మాత్రం ఒకేవిధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

నిబంధనలు సడలించిన ప్రభుత్వం..

ఇజ్రాయెల్‌ నిబంధనల ప్రకారం, పెళ్లైన, పెళ్లి కాని వ్యక్తుల నుంచి వీర్యాన్ని సేకరించవచ్చు. అయితే, వివాహం కాని యువకుడైతే అందుకు అక్కడి ఫ్యామిలీ కోర్టు అనుమతి తప్పనిసరి. అదే పెళ్లైన వ్యక్తి విషయానికొస్తే  భార్య అభ్యర్థన మేరకు వీటిని సేకరించాల్సి ఉంటుంది. కానీ, మరణించిన వారి నుంచి వీటిని సేకరించడం సవాలుతో కూడుకున్న పని. అయితే, పెళ్లి కాని యువకుల నుంచి కోర్టు అనుమతి తప్పనిసరి నిబంధనను ఇజ్రాయెల్‌ ప్రభుత్వం సడలించింది. అంతేకాకుండా ఇటువంటి వారికి సాయం చేసేందుకు నాలుగు స్పెర్మ్‌ బ్యాంకులు 24గంటల పాటు పనిచేసేలా ఐడీఎఫ్‌ నుంచి ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేసింది.

ఇప్పటికే 33 మంది నుంచి..

ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో అనేక మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో దుఃఖాన్ని దిగమింగుకున్న వారి కుటుంబీకులు.. చనిపోయిన వారి వీర్యాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు. తాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి చనిపోయిన 33 మంది యువకుల వీర్యాన్ని సేకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరిలో నలుగురు సాధారణ పౌరులు కాగా.. 29 మంది సైనికులు ఉన్నారు.

సైనికుల వీర్యానికి భారీ డిమాండ్‌!

కేవలం కుటుంబీకులే కాకుండా పిల్లల కోసం ప్రయత్నించే ఎంతో మంది మహిళలు వీర్య దాతల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సాధారణంగా రంగు, ఆకృతి, దేహ దారుఢ్యం కలిగిన వ్యక్తుల కంటే దేశం కోసం పోరాడే సైనికుల వీర్యానికే స్థానికంగా భారీ డిమాండు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా అక్కడ కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించే మహిళల్లో ఎక్కువగా సైన్యంలో (ఐడీఎఫ్‌) సేవలందించేవారికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్థానిక స్పెర్మ్‌ బ్యాంకులు గతంలో పేర్కొన్నాయి. అక్కడ దాతలుగా నమోదు చేసుకున్న వారిలో ఎక్కువగా సైన్యంలో పనిచేసిన వారేనని తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని