Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Sep 2022 10:04 IST

1. కరుణించవమ్మా... కనకదుర్గమ్మా!

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ...‘ అన్న కవివాక్కుకి నిక్కమైన నిదర్శనంగా భాసిల్లుతుంది ఇంద్రకీలాద్రిపైన వెలసిన కనకదుర్గమ్మ. దుర్గమ్మంటే దుర్గుణాల మహిషాసురుని మదమణచిన మహంకాళియే కాదు... తల్లిగా కొలిస్తే కోరిన శుభాలనొసగే కరుణామయి కూడా. విద్య, వివేకం, సంపద... ఇలా జీవితంలో నెగ్గుకురావడానికి కావాల్సిన అష్టైశ్వర్యాలనూ ప్రేమతో ప్రసాదించే అమ్మవారు కోట్లాది ప్రజలకి ఇలవేల్పు. గరళకంఠుడైన మల్లేశ్వరునిలో సగభాగమై బెజవాడలో వెలసిన దుర్గమ్మ నవరాత్రులకి కొలువుదీరే కోలాహలం చూసి తరించాల్సిందే... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సిరీస్‌ భాగ్యం ఎవరికో?

ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం అందుకు వేదిక కానుంది. తొలి టీ20లో ఓడినప్పటికీ.. రెండో మ్యాచ్‌ (ఇన్నింగ్స్‌కు ఎనిమిది ఓవర్ల చొప్పున కుదించిన)లో గెలిచిన భారత్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. బలమైన ఆసీస్‌ కూడా విజయమే లక్ష్యంగా బరిలో దిగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈ దసరాకు ఇంతేనా..!

పేద కుటుంబాలకు అసరాగా నిలిచే చౌకధరల దుకాణాల్లో నిత్యావసరాలకు కోత పడుతోంది. మూడు నెలలుగా చక్కెర, కందిపప్పు అరకొరగా అందజేస్తుండగా.. రానున్న అక్టోబరు నెల కోటాకు చక్కెర, కందిపప్పు కోత పడింది. ఫలితంగా ఒక బియ్యం పంపిణీతోనే సరిపెట్టనున్నట్లు సమాచారం. దీంతో పేదలు ఘనంగా జరుపుకొనే దసరా పండగకు తీపి అందకపోగా పప్పన్నం దూరం కానుంది. తీపి వంటకాలకు అవకాశం లేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇంజినీరింగ్‌ ఫీజుల కథ మళ్లీ మొదటికి

ఇంజినీరింగ్‌ ఫీజుల ఖరారు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) విచారణ పూర్తికావడంతో శనివారం జరిగే కమిటీ సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్పినా సాధ్యం కాలేదు. కమిటీ ఖరారు చేసిన ఫీజును 25 కళాశాలలు అంగీకరించకపోవడంతో మళ్లీ ఆ కాలేజీలను పిలిచి విచారణ జరపాలని నిర్ణయించారు. మావేశంలో కమిటీ ఖరారు చేసిన ఫీజులను సీబీఐటీ, నారాయణమ్మ, వర్ధమాన్‌, శ్రీనిధి, వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి, కేఎంఐటీ, స్టాన్లీ, మల్లారెడ్డి, సీఎంఆర్‌ గ్రూపుల్లోని కొన్ని కలిపి మొత్తం 25 కళాశాలలు అంగీకరించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వైద్యుడిగా బాధపడుతున్నా..

ఏందయ్యా ఇది..ఒక్క వైద్యుడు కూడా లేడు. ఏం చేస్తున్నారిక్కడ.. ఒక వైద్యుడిగా చాలా బాధపడుతున్నా... ఇంత మంది వైద్యులుండి ఏం లాభం.. విధులకు డుమ్మా కొడితే ఎలా..? అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ..శనివారం ఉదయం 11.35 గంటలకు ఆసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్‌సీడీ విభాగానికి చెందిన ఒక్క వైద్యుడు మాత్రమే విధులు నిర్వహిస్తూ కనిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 70వేల మంది ఉద్యోగులు ఉసూరు

పదవీ విరమణ వయసు పెంపు ఉద్యోగులు అందరికీ వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయడంతో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 70 వేల మంది ఉద్యోగులు ఉసూరుమంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే బోధనేతర సిబ్బందికి పదవీ విరమణ వయసు పెంపు వర్తించదని పేర్కొంటూ ఆర్థిక శాఖ ఈ నెల 23న ఉత్తర్వులు విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రేణిగుంటలో అగ్నిప్రమాదం.. వైద్యుడి సజీవదహనం

తిరుపతి జిల్లా రేణిగుంటలోని చిన్న పిల్లల ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపిండంతో.. అక్కడే ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ దుర్ఘటనలో వైద్యుడు రవిశంకర్‌రెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. అతడి కుమారుడు, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీలో డాక్టర్‌ రవిశంకర్‌రెడ్డి కార్తికేయ పేరుతో ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జిన్‌పింగ్‌ గృహ నిర్బంధం?

చైనా అధ్యక్షుడు, శక్తిమంతమైన నేతగా పేరొందిన షి జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారా? పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) అధిపతిగా ఉన్న ఆయన్ని పదవి నుంచి తొలగించారా?.. శనివారం గుప్పుమన్న ఈ వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వార్తను చైనా ప్రభుత్వం గానీ, దేశంలోని విశ్వసనీయ ప్రసార మాధ్యమాలు గానీ, ప్రపంచంలోని పెద్ద మీడియా సంస్థలు గానీ ధ్రువీకరించనప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వారంలో కనీసం 3 రోజులు కార్యాలయాలకు రావాల్సిందే!

 వారంలో కనీసం 3 రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తెలియజేసినట్లు సమాచారం. ఆ మేరకు ఉద్యోగులకు అంతర్గత మెయిల్‌ను పంపిందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎప్పటి నుంచి ఇది అమలవుతుందో మెయిల్‌లో తెలపనప్పటికీ.. మరింత సమాచారం కోసం హెచ్‌ఆర్‌ మేనేజర్లను సంప్రదించాల్సిందిగా ఉద్యోగులకు సూచించిందని ఆ వర్గాలు చెప్పాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘మోదీ థాలీ’ తింటే రూ.8.5 లక్షలు

ప్రధాని నరేంద్రమోదీ అభిమానులు తమ అభిమానాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా చాటుకుంటుంటారు. కొందరు పాలాభిషేకాలూ, అన్నదానాలూ, రక్తదానాలూ చేస్తే- మరికొందరు మొక్కలు నాటడం, పరిసరాలను శుభ్రం చేయడం వంటివి చేస్తుంటారు. ఎవరి స్తోమతకూ, స్థాయికీ తగ్గట్టూ వాళ్ల అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. దిల్లీలోని ‘అడోర్‌2.1’ రెస్టరంట్‌ను నిర్వహిస్తున్న సుమిత్‌ మాత్రం మోదీపైన ఆదరాభిమానాల్ని మరోలా వ్యక్తం చేస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని