Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 May 2023 09:14 IST

1. నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. కొత్త పార్లమెంట్‌ భవంతి వద్ద ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించిన మోదీ.. నూతన ప్రజాస్వామ్య సౌధంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం తమిళనాడుకు చెందిన మఠాధిపతుల నుంచి  ‘ఉత్సవ రాజదండం’ (సెంగోల్‌)ను ఆయన స్వీకరించారు. ఆ తర్వాత సెంగోల్‌ను లోక్‌సభలో స్పీకర్‌ కుర్చీ పక్కన నెలకొల్పి మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గోరంట్ల బుచ్చిబాబు క్రియాశీల కుట్రదారు

దిల్లీ మద్యం విధానంలో సౌత్‌ గ్రూప్‌నకు ఆడిటర్‌గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబు క్రియాశీల కుట్రదారు అని సీబీఐ ఆరోపించింది. ఈ కేసుపై 5,700 పేజీలతో అదనపు ఛార్జిషీట్‌ను సీబీఐ ఏప్రిల్‌ 25న దిల్లీ రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసింది. దీనికి సంక్షిప్తరూపంగా 54 పేజీల నివేదికను శనివారం న్యాయస్థానానికి సమర్పించింది. అదనపు ఛార్జిషీట్‌ను ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నిందితులు మనీశ్‌ సిసోదియా, గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్‌ పాండే, అమన్‌దీప్‌దల్‌ తదితరులకు సమన్లు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బుర్రా వేడెక్కుతుంది జాగ్రత్త!

‘ఆయన మండిపడుతున్నారు... వారిపై భగభగ  లాడుతున్నారు’... మానవ ఉద్వేగాల తీవ్రతను  తెలపటానికి తరచూ వినిపించేవే ఈ విశేషణాలు! కానీ ఇవి కేవలం విశేషణాలు కావనీ... సహజ    లక్షణాలేననీ, ముఖ్యంగా మండే ఎండల ప్రభావం మన బుర్రలపైనా, ఆలోచనలపైనా ఉంటుందంటున్నారు నిపుణులు. ఉష్ణోగ్రతలు పెరిగితే ఉద్వేగాలూ  పెరిగి నిరాశ నిస్పృహలతో నేరాలకూ దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గడ్డిపోచలతో ఏనుగులను ఢీ కొట్టారు..

అప్పటి వరకు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ, పెత్తందారులకు, భూస్వాములకే సొంతమైన రాజకీయాల్ని.. నేలకు దించి, రాష్ట్ర ప్రజలకు సరికొత్త రాజకీయాల్ని పరిచయం చేసిన ప్రజా నాయకుడు ఎన్టీఆర్‌. తెదేపాను స్థాపించగానే అప్పటి వరకు సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీల రాజకీయాధికారానికి బాటలు పడ్డాయి. రాజకీయాల్లోకి కొత్త నీరు వెల్లువలా వచ్చింది. వారి సామాజిక, ఆర్థిక స్థాయిని పట్టించుకోకుండా.. అంకితభావం, చిత్తశుద్ధి చూసి ఎన్టీఆర్‌ వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఉందా?

‘కిలో రెండు రూపాయల బియ్యం అంటే ఎన్టీఆర్‌.. ఉచిత విద్యుత్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్‌ గుర్తొస్తారు. ఇలా ఒక సంక్షేమం పేరు చెబితే చంద్రబాబు పేరు గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా?’ అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. శనివారం విశాఖ వైకాపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరంలో రాజకీయ డ్రామా జరుగుతోందని మహానాడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జూన్‌ 2 తర్వాతే చేరికలు కొలిక్కి!

అటు భాజపా, ఇటు కాంగ్రెస్‌ నేతలు భారాస మాజీ నాయకులతో చేస్తున్న చర్చల ఫలితం జూన్‌ రెండు తర్వాతే వెల్లడయ్యేలా ఉంది. కొన్ని రోజులుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పలు దఫాలుగా భేటీ అయ్యారు. అదే సమయంలో... కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఆ పార్టీ అధిష్ఠానం తరఫున చర్చిస్తున్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ ఆలోచన గిల్‌క్రిస్ట్‌ది: గావస్కర్‌

మొత్తం మీద లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఇప్పుడు ట్రోఫీపై కన్నేశాయి. రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్‌లో మంచి విజయాలతో ఫైనల్‌కు చేరుకున్నాయి. క్వాలిఫయర్స్‌, ఎలిమినేటర్‌ నిర్వహించడం ద్వారా.. లీగ్‌ దశలో నంబర్‌వన్‌, నంబర్‌-2 జట్లకు అదనపు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచన గిల్‌క్రిస్ట్‌ది. అప్పుడు నేను ఐపీఎల్‌ పాలవకవర్గంలో ఉన్నా. పోటీని మరింత ఆసక్తిగా మలచడానికి ఏం చేయాలో సూచించాలంటూ ఫ్రాంఛైజీల కెప్టెన్లందరికీ లేఖలు రాశా. ఎనిమిది మందిలో అయిదుగురు జవాబిచ్చారు. అందులో గిల్‌క్రిస్ట్‌ చేసిన ప్రతిపాదనను అంగీకరించి, 2011 సీజన్‌ నుంచి అమలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి

సత్యదేవ్‌ కథానాయకుడిగా...శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఫుల్‌బాటిల్‌’. సంజనా ఆనంద్‌ కథానాయిక. సర్వాంత్‌రామ్‌ పతాకంపై  రామాంజనేయులు జవ్వాజి, ఎస్‌.డి.కంపెనీ చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని శనివారం ప్రముఖ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. అనంతరం చిత్రబృందం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కథానాయకుడు సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పరుగుతో వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి మెరుగు

వ్యాయామంలో భాగంగా నడివయసులో పరిగెత్తడం వల్ల.. వార్ధక్యంతో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గుతాయని అమెరికా, మెక్సికో శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. యవ్వన దశలోకి వచ్చాక కొత్తగా ఏర్పడ్డ నాడీ కణాలను ఒక కీలక నెట్‌వర్క్‌తో అనుసంధానించడానికి ఇది వీలు కల్పిస్తుందని వారు తేల్చారు. వయసు మీద పడే క్రమంలో ‘ఎపిసోడిక్‌ మెమరీ’ నిర్వహణకు ఈ నెట్‌వర్క్‌ అవసరం. గతంలో జరిగిన అనుభవాలను, వాటితో ముడిపడ్డ సమయం, ప్రదేశం, భావాలతో సహా గుర్తుచేసుకోవడానికి ఎపిసోడిక్‌ మెమరీ దోహదపడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చెత్త పన్ను వసూలు చేస్తారా? జీతాల్లో రికవరీ చేయాలా?

పట్టణ స్థానిక సంస్థల్లో చెత్త పన్ను వసూలు చేయాల్సిందేనని వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శుల మెడపై అధికారులు కత్తి పెడుతున్నారు. నిర్దేశించిన వసూళ్ల లక్ష్యాలను చేరుకోనట్లయితే జీతాల్లో నుంచి రికవరీ చేస్తామని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కార్యదర్శులను హడలెత్తిస్తున్నారు. తీవ్రమైన పని ఒత్తిడితో ఆపసోపాలు పడుతున్న తమపై అధికారులు చెత్త పన్ను వసూళ్ల పేరుతో మానసికంగా తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని