Tamil Nadu: 12 గంటల పనివేళలపై.. వెనక్కి తగ్గిన స్టాలిన్‌

రోజుకు 12 గంటల పనివేళలపై తమిళనాడు (Tamil Nadu) సర్కారు వెనక్కి తగ్గింది. కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఈ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు సీఎం స్టాలిన్‌ ప్రకటించారు.

Published : 02 May 2023 01:41 IST

చెన్నై: ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో ఉద్యోగుల పనివేళలను (Working Hours) రోజుకు 12 గంటలకు పెంచుతూ తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు, విమర్శలు వెల్లువెత్తడంతో స్టాలిన్‌ సర్కారు వెనక్కి తగ్గింది. కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) సోమవారం వెల్లడించారు.

కార్మికుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. బిల్లు ఉపసంహరణపై ప్రకటన చేశారు. ‘‘వెనక్కి తగ్గడాన్ని నేను ఎప్పుడూ అవమానంగా భావించట్లేదు. సంస్కరణల కోసం చట్టాలను రూపొందించడానికే కాదు.. ఒక సమస్యపై భిన్నాభిప్రాయాలను అంగీకరించడానికి కూడా ధైర్యం అవసరం. వివిధ కార్మిక సంఘాల నుంచి ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ బిల్లును వెనక్కి తీసుకుంటున్నాం. దీనిపై త్వరలోనే శాసనసభ్యులందరికీ సమాచారం అందిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుల సంక్షేమంతో రాజీపడబోం. పరిశ్రమలు ఎదగడంతో పాటు కార్మికులు కూడా అభివృద్ధి చెందాలి’’ అని స్టాలిన్‌ (MK Stalin) వివరించారు.

ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో వారంలోని మొత్తం పనివేళల్లో (Working Hours) మార్పులేకుండా రోజుకు 12 గంటలు పనిచేసేలా స్టాలిన్ ప్రభుత్వం ఇటీవల ఓ బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వారంలో నాలుగు రోజులు మాత్రమే పనిచేసి, మిగతా మూడు రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు. 4 రోజుల తర్వాత పనిచేస్తే దానికి తగిన వేతనం ఉండేలా బిల్లు రూపొందించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏప్రిల్‌ 21వ తేదీన ఈ బిల్లును తమిళనాడు కార్మిక సంక్షేమశాఖ మంత్రి సీవీ గణేశన్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు సహా అధికార కూటమిలోని కొందరు సభ్యుల వ్యతిరేకత నడుమ మూజువాణి విధానంలో ఈ బిల్లును ఆమోదించారు.

అయితే ఈ బిల్లుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ బిల్లుతో కార్మికులు శ్రమ దోపిడీకి గురై ప్రమాదముందని ప్రతిపక్షాలే గాక.. డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్‌ కూడా ఆరోపించింది. ఇది పరిశ్రమల యాజమాన్యానికి అనుకూలమైన బిల్లుగా ఉందని మరికొందరు నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే బిల్లు అమలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏప్రిల్‌ 24న తమిళనాడు సర్కారు ప్రకటించింది. తాజాగా బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు స్టాలిన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు