నిన్నెవ్వరూ కాల్చరు.. లొంగిపో!

ఉడుకు రక్తం.. వయసుతో వచ్చే ఆవేశం.. అర్థం లేని ఆకర్షణ.. గమ్యం లేని లక్ష్యం.. ఇవి ఓ యువకుణ్ని ఉగ్రవాదంలో చేరేలా చేశాయి. కానీ, తన తప్పును తెలుసుకోవడానికి తనకి ఎన్నో రోజులు పట్టలేదు. ముష్కరులు జరిపే రక్తపాతంలో ఇమడలేకపోయాడు........

Updated : 17 Oct 2020 15:18 IST

ఉగ్రవాది లొంగిపోయిన భావోద్వేగ వీడియో

శ్రీనగర్: ఉడుకు రక్తం.. వయసుతో వచ్చిన ఆవేశం.. అర్థం లేని ఆకర్షణ.. గమ్యం లేని లక్ష్యం.. ఇవి ఓ యువకుణ్ని ఉగ్రవాదంలో చేరేలా చేశాయి. కానీ, తన తప్పును తెలుసుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ముష్కరులు జరిపే రక్తపాతంలో ఇమడలేకపోయాడు. వారిలా కరడుగట్టలేదు. తన కోసం విలపిస్తున్న తండ్రిని చూసి కరిగిపోయాడు. ‘నీకేం కాదు మా వద్దకు రా’ అని పిలుస్తున్న జవాన్లు అతనికి సొంత సోదరుల్లా కనిపించారు. వీటన్నింటి ముందు తన వద్ద ఉన్న ఏకే-47 శక్తిమంతమైందేం కాదనిపించింది. వెంటనే దాన్ని పక్కన పడేశాడు. లొంగిపోయాడు. తండ్రితో కలిసి ఆనందంగా ఇంటికి పయనమయ్యాడు. ఈ భావోద్వేగ ఘటన జమ్మూ-కశ్మీర్‌లో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియోను ఆర్మీ వర్గాలు విడుదల చేశాయి. వివరాల్లోకి వెళితే.. 

ఈ నెల 13న ఓ స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌(ఎస్‌పీవో) రెండు ఏకే-47 తుపాకులతో కనిపించకుండాపోయాడు. అదే రోజు చదూర ప్రాంతంలో జహంగీర్‌ భట్‌ అనే యువకుడూ ఆచూకీ లేకుండా పోయాడు. అప్పటి నుంచి అతని కోసం వాళ్ల కుటుంబ సభ్యులు గాలిస్తూనే ఉన్నారు. శుక్రవారం జరిపిన ఓ ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అతడు జహంగీరే అని జవాన్లు గుర్తించారు. అతడి తండ్రిని ఎన్‌కౌంటర్ జరుగుతున్న స్థలానికి తీసుకొచ్చారు. లొంగిపోవాలని ఆయనచేత చెప్పించారు. భయంతో వణుకుతూ తోటలో ఓ పొదల చాటున దాక్కున్న జహంగీర్‌కు తండ్రి మాట విని ప్రాణం లేచివచ్చింది. ‘దేవుడి మీద, మీ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాం నీకేం కాదు. నిన్నెవరూ కాల్చరు. వచ్చి లొంగిపో’ అని జవాన్‌ ఇచ్చిన హామీపై నమ్మకం కలిగింది. తుపాకీని పక్కనబెట్టి..చేతులు పైకెత్తి.. నెమ్మదిగా జవాన్ల వద్దకు చేరుకున్నాడు. 

అలా వచ్చిన అతనికి తాగడానికి నీళ్లిచ్చి సైనికులు ధైర్యం చెప్పారు. తప్పులు జరుగుతుంటాయి..నీకు ఏమీ కాదని భరోసా కల్పించారు. తన కొడుకును ఉగ్రవాదం ఉచ్చు నుంచి కాపాడినందుకు జహంగీర్‌ తండ్రి జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. అతనికీ ధైర్యం చెప్పిన సైనికులు ఇంకెప్పుడు తన కొడుకు ఉగ్రవాదం వైపు ఆకర్షితుడు కాకుండా చూసుకోవాలని సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు