యూకేకు AirIndia విమానాలు రద్దు

కరోనా ఉద్ధృతి దృష్ట్యా భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై ఇంగ్లాండ్‌ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకేకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు

Updated : 21 Dec 2022 14:54 IST

దిల్లీ: కరోనా ఉద్ధృతి దృష్ట్యా భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై ఇంగ్లాండ్‌ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకేకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. ఏప్రిల్‌ 24 నుంచి 30 వరకు భారత్‌-యూకే మధ్య విమానాలు రద్దు చేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. 

‘‘భారత్‌, యూకే మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు గమనిక.. యూకే ఇటీవల ప్రకటించిన ఆంక్షల నేపథ్యంలో ఏప్రిల్‌ 24 నుంచి ఏప్రిల్‌ 30 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నాం. 24-30 తేదీల్లో దిల్లీ, ముంబయి నుంచి యూకేకు వారానికి ఒక విమానాన్ని నడిపేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెబ్‌సైట్‌, మా సోషల్‌మీడియా ఛానళ్లలో అప్‌డేట్‌ చేస్తాం. విమానాల రీషెడ్యూలింగ్‌, రీఫండ్‌ తదిరత వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తాం’’అని ఎయిరిండియా బుధవారం ట్వీట్‌ చేసింది.

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటంతో బ్రిటన్‌ ఇటీవల భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై పలు ఆంక్షలు విధించింది. ప్రయాణాల విషయంలో భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో చేర్చిన యూకే.. ఆ దేశం నుంచే వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 10 రోజుల పాటు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని