పాకిస్థాన్‌కు అమెరికా మరో షాక్‌..!

పాకిస్థాన్‌కు షాకించ్చేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. పాకిస్థాన్‌కు కీలక నాటోయేతర భాగస్వామి హోదాను తొలగించాలని 117వ కాంగ్రెస్‌ సమావేశాల్లో ఓ సభ్యుడు బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు ఆండీ బిగ్గ్స్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

Updated : 04 Jan 2021 19:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌కు షాకిచ్చేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. పాకిస్థాన్‌కు కీలక నాటోయేతర భాగస్వామి హోదాను తొలగించాలని 117వ కాంగ్రెస్‌ సమావేశాల్లో ఓ సభ్యుడు బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు ఆండీ బిగ్గ్స్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే పాకిస్థాన్‌కు రక్షణ రంగంలో అమెరికా నుంచి లభించే కీలక సహకారం తగ్గిపోతుంది. ముఖ్యంగా రక్షణ రంగ ఉత్పత్తుల విక్రయం, రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టుల నిర్వహణ సాధ్యం కాదు. అంతేకాదు.. పాకిస్థాన్‌ సైనిక చర్యలు చేపట్టి ఉగ్రవాద గ్రూపుల్లో కీలకమైన హక్కానీ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసేవరకు అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకంగా పాక్‌ను కీలక నాటోయేతర భాగస్వామిగా ప్రకటించకూడదని పేర్కొంది. అంతేకాదు పాకిస్థాన్‌ హక్కాని నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడంలో.. మధ్యశ్రేణి నిర్వాహకులను అదుపులోకి తీసుకోవడంలో పురోగతి సాధించినట్లు ధ్రువీకరణ ఇవ్వాలని ఈ బిల్లులో కోరారు. 

నాటోయేతర కీలక భాగస్వామి హోదాతో..

2004లో బుష్‌ పాలనలో కీలక నాటోయేతర భాగస్వామి హోదాను పాకిస్థాన్‌కు ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాకు 17 దేశాలకు కీలక నాటోయేతర భాగస్వామి హోదాను ఇచ్చారు. 2019లో చివరిసారిగా బ్రెజిల్‌కు ఈ హోదాను ఇచ్చారు. ఈ హోదా పొందిన దేశాలు అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ డిఫెన్స్‌ చేసే పరిశోధనల్లో వ్యయాలను పంచుకొంటూ భాగస్వామి కావచ్చు.  దీంతోపాటు ఉగ్రవాదంపై పోరులో సహకరించుకోవచ్చు. యురేనియంతో తయారు చేసిన యాంటీ ట్యాంక్‌ రౌండ్స్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆయుధ సరఫరాల్లో ప్రాధాన్యం  లభిస్తుంది.  దీంతోపాటు ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌’కు అమెరికా బయట ఉన్న స్థావరాల్లోని రిజర్వులను అత్యవసర యుద్ధసమయాల్లో వాడుకొనే అవకాశం ఉంటుంది. ఇలా పలు రకాల ప్రయోజనాలు ఈ భాగస్వామికి లభిస్తాయి. జనవరిలో అధ్యక్షుడు ట్రంప్‌ 2018లో అమెరికా నుంచి పాక్‌కు అందాల్సిన ఆర్థిక సాయాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ట్రంప్‌ కార్యవర్గం పాకిస్థాన్‌కు ఉన్న నాటోయేతర భాగస్వామి హోదాను కూడా రద్దు చేయాలని భావిస్తున్నారు. గతంలో ఒబమా హయాంలో భారత్‌కు ఇలాంటి హోదాను కల్పించింది. 

ఇవీ చదవండి

కొవాగ్జిన్‌ వైపు ప్రపంచ దేశాల చూపు..!
2 గ్రామాలపై ఉగ్రదాడి.. 100 మంది కాల్చివేత

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని