Covid-19: విదేశాల్లో కొవిడ్‌ విజృంభణ.. రాష్ట్రాల్ని అప్రమత్తం చేసిన కేంద్రం

పలు దేశాల్లో కరోనా(Corona) విజృంభణ దృష్ట్యా భారత్‌లోనూ అప్రమత్తత అవసరమని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పలు సూచనలు చేసింది.

Updated : 20 Dec 2022 20:43 IST

దిల్లీ: ప్రపంచ దేశాల్లో కరోనా(Corona Virus) మళ్లీ విజృంభిస్తుండటంతో కేంద్రం(Central Government) అప్రమత్తమైంది. చైనా, జపాన్‌, దక్షిణకొరియా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో కొత్త కేసులు భారీగా వెలుగుచూస్తుండటంతో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.  రోజువారీ పాజిటివ్‌ కేసుల నమూనాలను  జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలని సూచించింది. దీనివల్ల కొత్త వేరియంట్‌లు ఏవైనా ఉంటే త్వరగా గుర్తించవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌(Rajesh Bhushan) రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, చైనా, అమెరికాల్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భారత్‌లో నాలుగో వేవ్‌(Fourth wave) ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌-వ్యాక్సినేషన్‌-కట్టడి అనే ఐదంచెల వ్యూహంతో భారత్‌  కరోనా వ్యాప్తిని సమర్థంగా నియంత్రించగలిగిందని తెలిపారు. 

ప్రస్తుతం భారత్‌లో వారానికి 1200 కేసులు నమోదవుతుండగా, ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయని భూషన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ ఏడాది జూన్‌లో కరోనా కట్టడికి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ల వ్యాప్తిని కట్టడి చేసేందుకు వీలుగా అనుమానితులకు ముందస్తుగా గుర్తించి, ఐసోలేట్ చేయడం అత్యంత ఆవశ్యకమని సూచించారు. 

రేపు ఆరోగ్యశాఖ మంత్రి కీలక సమీక్ష

పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతలో భాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రేపు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు వైద్యరంగ నిపుణులు హాజరు కానున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని