Mysuru:పునాది లేకుండానే ఇంటి నిర్మాణం.. ఖర్చు 40% తక్కువే!

ఇంటిని నిర్మించాలంటే ముందుగా పునాది సిద్ధం చేయాలి. కానీ కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్‌ అసలు పునాదే లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు.

Published : 14 Jan 2022 10:58 IST

ఇంటిని నిర్మించాలంటే ముందుగా పునాది సిద్ధం చేయాలి. కానీ కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్‌ అసలు పునాదే లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. అందుకోసం మూడు సరికొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇప్పటికే రెండు ఇళ్లను నిర్మించి.. అందరి మన్ననలు పొందుతున్నారు. అతడే ఆర్కిటెక్ట్‌ శరత్‌ కుమార్‌. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా తక్కువ ధరలో, తక్కువ సమయంలో పునాది లేకుండానే ఇంటి నిర్మాణం చేపట్టొచ్చని చెబుతున్నారు. ఈ సాంకేతికతను అడ్వాన్స్‌డ్‌ రాపిడ్‌ కన్‌స్ట్రక్షన్‌గా పేర్కొన్నారు. శరత్‌ కుమార్‌ రెండు సంవత్సరాల పాటు ఓ విదేశీ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పని చేశారు. ఈ క్రమంలోనే పునాది లేకుండా ఇంటిని నిర్మించే టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు. కొత్త సాంకేతికతతో తొలుత హెచ్‌డీ కోటే ప్రాంతానికి సమీపంలో ఓ డైరీ భవనాన్ని నిర్మించారు శరత్‌. విజయవంతంగా దానిని పూర్తి చేశాక మైసూర్‌లోని బండిపాళ్యలో ఓ ఇంటి నిర్మాణం చేపట్టారు.

కర్ణాటకలో పునాది లేకుండానే నిర్మించిన తొలి ఇల్లుగా ఇది గుర్తింపు పొందింది. ‘‘సాధారణంగా ఇంటి నిర్మాణం కోసం 5-6 అడుగుల లోతు పునాది తీయాల్సి ఉంటుంది. కానీ మేము పునాది లేకుండా ఇంటిని నిర్మించేందుకు మూడు పద్ధతులను ఉపయోగించాం. మొదటిది పైల్‌ ఫౌండేషన్, ఇందులో ట్రాక్టర్‌ ద్వారా 7 అడుగుల లోతు వరకు రంధ్రం చేసి పిల్లర్‌ను ఏర్పాటు చేస్తాం. రెండోది ప్లింత్‌ బీమ్‌. మూడోది స్లాబ్‌ ఆన్‌ గ్రేడ్‌ పద్ధది. ఇంటిని నిర్మించేందుకు కనీసం 6-7 నెలల సమయం పడుతుంది. కానీ ఈ కొత్త సాంకేతికత ద్వారా 3 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయొచ్చు. ఇందుకోసం కూలీల అవసరం కూడా ఎక్కువగా ఉండదు. 30-40 శాతం నిర్మాణ వ్యయం తగ్గిపోతుంది. నిర్మాణానికి కాంక్రీట్‌ ఉపయోగించటం వల్ల ఇల్లు 75-100 ఏళ్ల పాటు మన్నికగా ఉంటుంది’’ అని శరత్‌ చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని