ఆపద్బాంధవ ఆర్పీఎఫ్‌

తాము చేపట్టిన భద్రత చర్యల కారణంగా గత ఏడాది దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో 17,756 మంది చిన్నారులను రక్షించినట్లు రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది.

Published : 26 Jan 2023 05:48 IST

17,756 మంది చిన్నారుల్ని కాపాడిన రక్షణ దళం
మానవ అక్రమ రవాణాదారుల నుంచి 559 మందికి విముక్తి

ఈనాడు, దిల్లీ: తాము చేపట్టిన భద్రత చర్యల కారణంగా గత ఏడాది దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో 17,756 మంది చిన్నారులను రక్షించినట్లు రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. ‘చిన్నారి దేవదూతలు’ పేరుతో రైల్వే స్టేషన్లలో గట్టి నిఘా ఉంచి ఇళ్ల నుంచి పారిపోయి వచ్చిన, తప్పిపోయిన 17,756 మంది చిన్నారులను రైల్వే రక్షణ దళం(ఆర్పీఎఫ్‌) రక్షించినట్లు తెలిపింది. ‘ఆపరేషన్‌ ఆహ్త్‌’ ద్వారా 559 మందిని మానవ అక్రమ రవాణా నుంచి రక్షించి 194 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. రైలు ప్రమాదాల నుంచి 852 మందిని ఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడినట్లు తెలిపింది. ‘ఆపరేషన్‌ నార్కోస్‌’ కింద రూ.80 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల(డ్రగ్స్‌)ను పట్టుకోవడంతో పాటు 1,081 మందిని ఆర్పీఎఫ్‌ అదుపులోకి తీసుకుంది. ‘ఆపరేషన్‌ అమానత్‌’ ద్వారా రైళ్లలో ప్రయాణికులు మరిచిపోయిన 25,500 లగేజీ బ్యాగ్‌లను సంబంధిత వ్యక్తులకు భద్రంగా అప్పగించింది. వన్య ప్రాణులను అక్రమంగా రవాణా చేస్తున్న 75 మందిని అరెస్ట్‌ చేసింది. టోల్‌ఫ్రీ నెంబర్‌ 139కి వచ్చిన 2 లక్షల ఫోన్‌కాల్స్‌ను అందుకొని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఆర్పీఎఫ్‌ సాయం చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైళ్లలో స్మగ్లింగ్‌ చేస్తున్న రూ.48.8 కోట్ల విలువైన బంగారం, రూ.8.21 కోట్ల విలువైన వెండి, రూ.35 లక్షల విలువైన ఇతర లోహాలు, రూ.2.77 కోట్ల విలువైన విదేశీ వస్తువులు, రూ.25.37 కోట్ల నల్లధనం, రూ.82 లక్షల విలువైన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, రూ.1.7 కోట్ల విలువైన నిషేధిత ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. రైల్వేల్లో చోరీ అయిన రూ.7.37 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేసి 11,268 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు