అంతరిక్షంలో అత్యాధునిక హోటల్‌!

ఒకప్పుడు వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్తున్నారంటే గొప్ప విషయంగా కనిపించేది. ఇప్పుడు అదేదో టూర్‌కు వెళ్లినట్లు వెళ్లివస్తున్నారు. వాళ్లే కాదు.. సామాన్యులను సైతం ప్రైవేటుగా అంతరిక్షానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్పేస్‌ ఎక్స్‌ సహా పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మరి సామాన్యులు

Updated : 03 Mar 2021 18:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్తున్నారంటే గొప్ప విషయంగా కనిపించేది. ఇప్పుడు అదేదో టూర్‌కు వెళ్లినట్లు వెళ్లి వస్తున్నారు. వాళ్లే కాదు.. సామాన్యులను సైతం అంతరిక్షానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్పేస్‌ ఎక్స్‌ సహా పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మరి సామాన్యులు అంతరిక్షానికి వెళ్తే అక్కడ బస చేయడానికి వసతులు ఉండాలి కదా..! అందుకే ఓ సంస్థ అంతరిక్షంలో స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. 2027నాటికి అంతరిక్షానికి వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతామని వెల్లడించింది.

భూమికి 2వేల కి.మీ ఎత్తు వరకు ఉండే కక్ష్యను భూ నిమ్న కక్ష్య అంటారు. ఈ కక్ష్యలోనే అమెరికా, జపాన్‌, రష్యా, యూరప్‌, కెనడా కలిపి అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాయి. తాజాగా ఈ భూ నిమ్న కక్ష్యలోనే అంతరిక్ష కేంద్రానికి దగ్గరలో ఒక హోటల్‌ నిర్మించాలని గ్రూప్‌ ఆర్బిటాల్‌ అసెంబ్లీ అనే సంస్థ నిర్ణయించింది. 2025లో నిర్మాణం ప్రారంభించి.. 2027నాటికి అంతరిక్షానికి వచ్చే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ ఖగోళ హోటల్‌లో స్పా, సినిమాహాల్‌, జిమ్‌, లైబ్రరీ, సంగీత కార్యక్రమాలు నిర్వహించడానికి వేదికలు, అంతరిక్షం నుంచి భూమిని చూసే విధంగా లాంజ్‌లు, బార్‌, 400 మందికి సరిపడా గదులు ఉండనున్నాయి. సిబ్బంది ఉండటానికి ప్రత్యేకంగా క్వార్టర్స్‌ నిర్మిస్తారట. 

ఈ అంతరిక్షంలో వేలాడుతూ.. తిరుగుతూ ఉండే ఈ హోటల్‌ ప్రతి 90 నిమిషాలకు ఒక భ్రమణం పూర్తి చేస్తుందట. అంతేకాదు కృత్రిమంగా గురుత్వాకర్షణ శక్తిని సృష్టిస్తామని సంస్థ వెల్లడించింది. ఈ గురుత్వాకర్షణ శక్తి చంద్రుడిపై ఉండే భూమాకర్షణ శక్తితో సమానంగా ఉంటుందట. ఈ హోటల్‌లో 20x21 మీటర్ల విస్తీర్ణంలో ఉండే గదుల్ని కొనుగోలు చేసి వ్యక్తిగత గెస్ట్‌హౌజ్‌గా మార్చుకోవచ్చని ఆర్బిటాల్‌ అసెంబ్లీ చెబుతోంది. ఈ సంస్థ ప్రణాళిక భలేగా ఉన్నా.. హోటల్‌ నిర్మాణంలో ఎంతమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు