500 రాకెట్లను తట్టుకొన్న ఉక్కుగొడుగు అది..!

ప్రతి మూడు నిమిషాలకో రాకెట్‌ గర్జనతో ఇజ్రాయెల్‌ దద్దరిల్లిపోయింది. అయినా కానీ, అతిస్వల్ప నష్టంతో బయటపడింది.

Updated : 12 May 2021 15:28 IST

 ఐరన్‌డోమ్‌ లేకపోతే భారీ నష్టమే

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రతి మూడు నిమిషాలకో రాకెట్‌ గర్జనతో ఇజ్రాయెల్‌ దద్దరిల్లిపోయింది. అయినా కానీ, అతిస్వల్ప నష్టంతో బయటపడింది. ప్రత్యర్థులపై దాడులు నిర్వహించింది. కేవలం ఒక రక్షణ వ్యవస్థే ఇజ్రాయెల్‌ను కాపాడిందని చెప్పాలి. అదే ‘ఐరన్‌డోమ్‌’ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌. పదేళ్ల క్రితం సేవలు అందించడం ప్రారంభించిన ఈ వ్యవస్థ ఇప్పటి వరకు వేల కొద్దీ రాకెట్లను గాల్లోనే ధ్వంసం చేసింది. ఒక రకంగా గతం పరిశీలిస్తే.. ఐరన్‌డోమ్‌ వచ్చాక.. రాక ముందు అన్నంత మార్పు కనిపిస్తుంది. తాజాగా ఇజ్రాయెల్‌-పాలస్తీనాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకోవడంతో మరోసారి ఈ గగనతల రక్షణ వ్యవస్థ వార్తలో కేంద్రబిందువుగా నిలిచింది.

ఏమిటీ ఐరన్‌ డోమ్‌..?

సాధారణంగా సమీప దూరాల్లోని ప్రత్యర్థుల స్థావరాలను ధ్వంసం చేయడానికి స్వల్ప శ్రేణి రాకెట్లు, శతఘ్నులు, మోర్టార్లను వినియోగిస్తుంటారు. దూరం తక్కువ ఉండటంతో ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి శత్రువులకు తగినంత సమయం లభించదు. అటువంటి ముప్పులను ముందుగానే గమనించి గాల్లోనే ధ్వంసంచేసే వ్యవస్థను ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అమెరికా ఆర్థిక సహకారంతో దశాబ్దం క్రితం అభివృద్ధి చేసింది. దానిని ఐరన్‌డోమ్‌గా వ్యవహరిస్తుంది. 2011లో వినియోగంలోకి తీసుకొచ్చింది. గాజాపట్టీ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లు, శతఘ్ని గుండ్లను ఇది ఎదుర్కొంటుంది.  దీని రేంజి 70 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది కాకుండా ఇజ్రాయెల్‌ వద్ద ‘డేవిడ్‌స్లింగ్‌’,‘యారో’ అనే రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఇవి దీర్ఘశ్రేణి క్షిపణుల వంటి  వాటిని ఎదుర్కొంటాయి.

ఎలా పనిచేస్తుంది..?

ఈ వ్యవస్థ మొత్తంలో రాడార్లు,సాఫ్ట్‌వేర్‌,రాకెట్‌ ప్రయోగించే బ్యాటరీలు ఉంటాయి. గాజాపట్టీలో రాకెట్‌ ప్రయోగించిన వెంటనే రాడార్‌ పసిగట్టి.. దాని గమనాన్ని సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థకు పంపిస్తుంది. వచ్చే రాకెట్‌ ఏ ప్రదేశంలో పడుతుందో గుర్తిస్తుంది. ఆ ప్రదేశం ఖాళీగా ఉంటే రాకెట్‌ను ప్రయోగించదు. అదే వ్యూహాత్మక ప్రాంతంలో, జనావాసాలపై పడే అవకాశం ఉంటే మాత్రం బ్యాటరీ నుంచి రాకెట్‌ను ప్రయోగిస్తుంది. ఐరన్‌ డోమ్‌ నుంచి వెలువడిన టమిర్‌ క్షిపణి ప్రత్యర్థుల రాకెట్‌ను గాల్లోనే పేల్చివేస్తుంది. 

ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతూ..

2011లో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ కీలక విభాగాలను ఇజ్రాయెల్‌ ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తోంది. హార్డ్‌వేర్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా.. ముప్పును విశ్లేషించే సాఫ్ట్‌వేర్‌ను మాత్రం బాగా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఐరెన్‌ డోమ్‌ క్షిపణులు, డ్రోన్లు ఇతర ముప్పులను కూడా సమర్థంగా ఎదుర్కోగలదని ఇజ్రాయెల్‌ రక్షణ శాఖలోని ఓ విభాగానికి డైరెక్టర్‌ అయిన మోషెపటేల్‌ పేర్కొన్నారు. 

ఎంతవరకు విజయవంతమైంది..?

ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లో దీనిని అమర్చిన నాటి నుంచి వేల సంఖ్యలో హమాస్‌ రాకెట్లను కూల్చేసిందని ఇజ్రాయెల్‌ అధికారులు చెబుతున్నారు. ఈ గగనతల రక్షణ వ్యవస్థ 90శాతం విజయవంతగా రాకెట్లను కూల్చేసినట్లు వెల్లడించారు. కాకపోతే విమర్శకులు మాత్రం ఈ లెక్కలపై సందేహాలు వెలిబుచ్చుతున్నారు. గాజా వైపు ఉన్న హమాస్‌ మిలిటెంట్లు కూడా ఈ వ్యవస్థ పనితీరును అర్థం చేసుకొని.. మార్పులు చేసుకొంటున్నారన్నారు. ‘ఏ క్షిపణి రక్షణ వ్యవస్థ పూర్తిగా నమ్మదగినది కాదు’ అని బ్రూక్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ మిషెల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్ పేర్కొన్నారు. ఆయన గత కొన్నేళ్లుగా ఈ వ్యవస్థల పనితీరు పై అధ్యయనం చేస్తున్నారు.

ఖర్చు కూడా తక్కువ..

ఈ వ్యవస్థ రాక ముందు గాజాపట్టీ వైపు నుంచి దాడులు జరిగితే అక్కడకు ఇజ్రాయెల్‌ సైన్యాన్ని పంపించాల్సి వచ్చేది. అప్పుడు మరిన్ని ఘర్షణలు జరిగి ఇరు పక్షాలవైపు ప్రాణనష్టం ఎక్కువగానే ఉండేది. కానీ, ఈ వ్యవస్థ వచ్చాక దళాలు అక్కడకు వెళ్లాల్సిన అవసరంలేదు. ఈ వ్యవస్థలోని అప్రమత్తం చేసే సైరన్‌ విని ప్రజలు సురక్షిత స్థానాలకు తరలివెళుతున్నారు. అమెరికా రక్షణ శాఖ కూడా ఇజ్రాయెల్‌ నుంచి ఈ వ్యవస్థలను కొనుగోలు చేసి వినియోగిస్తోంది. ఇక గాల్లో వచ్చే క్షిపణులను ఢీకొనాలంటే గగనతల రక్షణ వ్యవస్థలకు క్షిపణుల రూపంలో భారీగా ఖర్చవుతుంది. కానీ, ఐరన్‌ డోమ్‌ మాత్రం ఆ ఖర్చును తప్పించింది. ప్రత్యర్థి శిబిరం నుంచి వచ్చే రాకెట్‌, శతఘ్నిగుండు జనావాసాలకు దూరంగా పడుతుందని అంచనా వేస్తే ఎటువంటి క్షిపణిని ప్రయోగించదు. దీంతో ఆ మేరకు ఖర్చు మిగులుతుంది.

చిన్న ఆయుధాలతో అధిక దాడులు..

ఇజ్రాయెల్‌ ప్రత్యర్థి అయిన హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ చిన్న స్థాయి ఖాస్సామ్‌ రాకెట్లను భారీ సంఖ్యలో ప్రయోగిస్తుంటుంది. దీనిని హమాసే ఇరాన్‌ సహకారంతో అభివృద్ధి చేసింది. ఒక్కో రాకెట్‌ ఖరీదు 4వేల డాలర్ల లోపే ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఖాస్సామ్‌ 3 రకాన్ని వినియోగిస్తోంది. వీటిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్‌ ప్రయోగించే ఒక్కో క్షిపణి ఖరీదు 80వేల డాలర్లు(వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం ప్రకారం) ఉంటుంది.  హమాస్‌ వద్ద వేల సంఖ్యలో ఖాస్సామ్‌  రాకెట్లు ఉన్నాయి.  అందుకే మంగళవారం మధ్యాహ్నం దాదాపు 200 రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్లకు అవసరమైన ముడిపదర్థాలను ఇరాన్‌ నుంచి ఈజిప్ట్‌ సరిహద్దుల మీదగా తీసుకొస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి.

గత రెండు రోజుల్లో హమాస్‌ సంస్థ  ఇజ్రాయెల్‌పై దాదాపు 500 రాకెట్లను  ప్రయోగించింది. వీటిల్లో చాలా వరకు ఐరన్‌డోమ్‌ గాల్లోనే పేల్చేసింది. అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే జనావాసాలపై పడ్డాయి. దీంతో ఇద్దరు చనిపోయారు. అదే ఐరన్‌ డోమ్‌ లేకపోతే నష్టం అత్యంత భారీగా ఉండేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని