PM Modi: సుస్థిర ప్రభుత్వం వల్లే వేగంగా దేశాభివృద్ధి: ప్రధాని మోదీ

సుస్థిరమైన ప్రభుత్వాల వల్లనే దేశాభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. కచ్చితమైన మెజార్టీతో ప్రభుత్వాల ఏర్పాటు ప్రజాశక్తితో సాధ్యమవుతుందని తెలిపారు.

Published : 30 Oct 2023 17:56 IST

మెహసానా: ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే దేశంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని గుజరాత్‌ (Gujarat)లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మెహసానా జిల్లాలో రూ.5,950 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కచ్చితమైన నిర్ణయంతో గుజరాత్‌ ప్రజలు కొన్నేళ్లుగా సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ప్రధాని అన్నారు. 

‘‘మీరు నన్ను ప్రధానిగా కంటే మీ నరేంద్రభాయ్‌గానే ఎక్కువగా ఆదరిస్తారు. మీ నరేంద్రభాయ్‌ ఒకసారి ప్రతిజ్ఞ చేశాడంటే.. తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడని మీ అందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా గుజరాత్‌లో పెద్ద ప్రాజెక్ట్‌ల నిర్మాణం, అభివృద్ధి పనుల్లో వేగం వెనుక మీరు ఎన్నుకున్న సుస్థిర ప్రభుత్వం ఉంది. దేశం కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుందంటే.. దానికి కారణం కేంద్రంలో కచ్చితమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు అవకాశం కల్పించిన ప్రజాశక్తి’’ అని ప్రధాని తెలిపారు. అంతకుముందు బనస్కాంత జిల్లా అంబాజీ నగరంలో ఉన్న అంబా ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. అంబాజీలో ప్రధాని పర్యటన సందర్భంగా ప్రజలు, భాజపా కార్యకర్తలు రోడ్డు ఇరువైపులా నిలబడి ఘన స్వాగతం పలికారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని