Mukesh Ambani: కేదార్‌నాథ్‌- బద్రీనాథ్‌ క్షేత్రాలకు ముకేశ్‌ అంబానీ భారీ విరాళం

కేదార్‌నాథ్‌-బద్రీనాథ్‌ ఆలయ కమిటీకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భారీ విరాళం అందజేశారు.

Published : 12 Oct 2023 21:34 IST

దేహ్రాదూన్‌: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి ప్రఖ్యాత కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ క్షేత్రాలను దర్శించుకున్నారు. చమోలీ జిల్లాలోని బద్రీనాథ్‌, రుద్రప్రయాగ్‌జిల్లాలోని కేదార్‌నాథ్‌ ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం కేదార్‌నాథ్‌-  బద్రీనాథ్‌ ఆలయ కమిటీ (BKTC)కి రూ.5 కోట్లు విరాళం అందజేశారు. ఈ పర్యటనలో అంబానీ వెంట తనకు కాబోయే కోడలు రాధికా మర్చంట్‌ ఉన్నారు. తొలుత అక్కడికి చేరుకున్న ముకేశ్‌ అంబానీకి బీకేటీసీ ఛైర్మన్‌, భాజపా నేత అజేంద్ర అజయ్‌తో పాటు కమిటీ ఉపాధ్యక్షుడు కిశోర్‌ పవార్‌ స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా బీకేటీసీ ఛైర్మన్‌ అజేంద్ర అజయ్‌ మాట్లాడుతూ.. ముకేశ్ అంబానీ ఈరోజు కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లో పూజలు నిర్వహించినట్టు తెలిపారు.  కేదార్‌నాథ్‌-బద్రీనాథ్‌ ఆలయ కమిటీ(BKTC)కి రూ.5కోట్లు విరాళం చెక్కును అందజేశారని వెల్లడించారు. విరాళం అందజేసినందుకు గాను ముకేశ్‌ అంబానీకి తమ ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు చెప్పామని అన్నారు. అలాగే, ఆలయ కమిటీ ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులపై ఆయనతో చర్చించగా..  సాధ్యమైనంత మేరకు సాయం చేస్తానని అంబానీ హామీ ఇచ్చారని అజయ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని