PM Modi: మహిళా శక్తి అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తా: మోదీ

తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే దేశంలో మహిళల అభివృద్ధి విషయంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తానని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు.

Updated : 11 Mar 2024 16:42 IST

దిల్లీ: తాను మూడోసారి ప్రధానిగా గెలిస్తే దేశంలో మహిళల అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తానని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు. సోమవారం దిల్లీలో జరిగిన సశక్త్‌ నారీ-వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని స్త్రీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏ సమాజం అయితే మహిళల అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తుందో ఆ సమాజం వృద్ధి చెందుతుందని తాను నమ్ముతానని అన్నారు. తమ ప్రభుత్వం వనితల కోసం అమలుచేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉదహరించారు. 

కార్యక్రమంలో భాగంగా స్వయంసహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) బ్యాంకు రుణాలుగా దాదాపు రూ.8,000 కోట్లను మోదీ పంపిణీ చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోగలమన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

వివిధ ప్రభుత్వ పథకాల కింద రూ.8 లక్షల కోట్లకు పైగా నగదును మహిళలకు పంపిణీ చేశామని ప్రధాని మోదీ తెలిపారు. ఇప్పటివరకు కోటి మంది స్త్రీలు లఖపతి దీదీలుగా మారారని ఆయన చెప్పారు. మహిళలకు చిన్న సహాయం చేసినా వారు తిరిగి ఇతరులకు సహాయం చేస్తారనే విషయం తన అనుభవం ద్వారా తెలుసుకున్నానన్నారు. తమ కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించే రాజకీయ నాయకులు దీనిని ఎప్పటికీ అర్థం చేసుకోలేరని ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చేవి కావని తమ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో పథకాలను చేపట్టిందని తెలిపారు. మహిళలు గౌరవంగా జీవించడానికి వారికి మరుగుదొడ్లు ఏర్పాటుచేయడం, శానిటరీ ప్యాడ్‌ల వాడకం గురించి అవగాహన కల్పించడం, వంట చెరుకు పొగ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించడం వంటి మహిళల సమస్యల గురించి మాట్లాడిన మొదటి ప్రధాని తానే అని మోదీ పేర్కొన్నారు. ఇలా చేసినందుకు కాంగ్రెస్‌ వంటి రాజకీయ పార్టీలు నాడు తనను ఎగతాళి చేశాయని, అవమానించాయని గుర్తు చేసుకున్నారు.

అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా లబ్ధిదారులతో ఆయన మాట్లాడి వారి పని గురించి అడిగి తెలుసుకున్నారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ మద్దతుతో విజయం సాధించిన, స్వయం సహాయక బృందాల అభ్యున్నతికి సహకరిస్తున్న ‘లఖపతి దీదీ’లను మోదీ సత్కరించారు. ఈ సందర్భంగా, వ్యవసాయ సంబంధిత ప్రయోజనాల కోసం డ్రోన్‌లను ఆపరేట్ చేయడానికి ఎంపికైన 1,000 మంది ‘నమో డ్రోన్ దీదీస్’ మహిళలకు వాటిని అందజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు