Nanded hospital deaths: నాందేడ్‌ ఆసుపత్రిలో ఆగని మృత్యుఘోష.. గత 8 రోజుల్లో 108 మరణాలు

Nanded hospital deaths: నాందేడ్‌ ఆసుపత్రిలో గత ఎనిమిది రోజుల్లో మరో 108 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆసుపత్రిలో వరుసగా రోగులు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది.

Published : 11 Oct 2023 15:21 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి (Nanded Govt hospital)లో రోగుల మృత్యుఘోష కొనసాగుతోంది. ఇటీవల ఈ ఆసుపత్రిలో కేవలం 48 గంటల వ్యవధిలోనే 31 మంది మృతిచెందడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు గడిచిన ఎనిమిది రోజుల్లో ఈ హాస్పిటల్‌లో మరో 108 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లోనే 11 మంది రోగులు మరణించగా.. వీరిలో ఓ పసికందు కూడా ఉండటం విచారకరం. (Nanded hospital deaths)

అక్టోబరు నెల ఆరంభంలో ఈ ఆసుపత్రిలో 24 గంటల్లో 24 మంది మరణించిన విషయం తెలిసిందే. వారిలో 12 మంది శిశువులున్నారు. అయితే.. ఔషధాల కొరత (medicine shortage), వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆసుప్రతిలో రోగులు మృతిచెందుతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వీటిని ఆసుపత్రి యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. వారు అత్యంత విషమ పరిస్థితుల్లోనే తమ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపింది. వీరిలో కొందరు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది.

కాంగ్రెస్‌ సమావేశంలో క్యాండీక్రష్‌ ఆడిన సీఎం.. ఫొటో షేర్‌ చేసి భాజపా విమర్శలు..

ఈ వరుస మరణాలపై తాజాగా ఆసుపత్రి డీన్‌ శ్యామ్‌ వాకోడే మరోసారి స్పందిస్తూ.. ఔషధాల కొరత ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘మా హాస్పిటల్‌లో ఔషధ నిల్వలు సరిపడా ఉన్నాయి. మేం మూడు నెలలకు సరిపడా మందులను అందుబాటులో ఉంచుతాం. సిబ్బంది కూడా రోగులకు అన్నివేళలా చికిత్స అందిస్తున్నారు. ఔషధాల కొరత కారణంగా ఏ రోగీ ప్రాణాలు కోల్పోవట్లేదు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే చనిపోతున్నారు. ఇక మరణించిన చిన్నారుల్లో కొంతమందికి పుట్టుకతో వచ్చిన ఆరోగ్య సమస్యలున్నాయి’’ అని తెలిపారు.

నాందేడ్‌ ఆసుపత్రిలో నవజాత శిశువులు, రోగుల మృత్యువాత పడటం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనను బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అటు జాతీయ మానవహక్కుల కమిషన్‌ (NHRC) కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని