భాజపా అంటే ఉగ్రవాదులకు వణుకు.. అందుకే మోదీ వచ్చాక..: రాజ్‌నాథ్‌

నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఇప్పటి వరకు దేశంలో భారీ స్థాయిలో ఉగ్రదాడులు చోటుచేసుకోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  అన్నారు. కేంద్రంలోని భాజపా అంటే ఉగ్రవాదులకు వణుకు అని చెప్పారు.

Published : 03 Sep 2021 01:57 IST

కేవడియా (గుజరాత్‌): నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఇప్పటి వరకు దేశంలో భారీ స్థాయిలో ఉగ్రదాడులు చోటుచేసుకోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  అన్నారు. కేంద్రంలోని భాజపా అంటే ఉగ్రవాదులకు వణుకు అని చెప్పారు. గుజరాత్‌లో కేవడియాలో నిర్వహించిన పార్టీ సమావేశంలో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు.‘‘ఏది ఏదైనా ఉగ్రవాదుల ఆటలు మేం సాగనివ్వం. జమ్మూకశ్మీర్‌ విషయాన్ని పక్కనపెడితే మోదీ వచ్చాక దేశంలో ఏ మూలా ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు. ఇది మా గొప్ప విజయం. దీనిబట్టి చూస్తే భాజపా అంటే ఉగ్రవాదులకు వణుకు అని అర్థమవుతోంది. ఇప్పటి వరకు స్వర్గధామంగా భావించిన ప్రాంతాలు కూడా వారికి ఏమాత్రం క్షేమం కావని వారికి అర్థమైంది’’ అంటూ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్‌ దాడులను గురించి రాజ్‌నాథ్‌ ప్రస్తావించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్మీ జవాన్ల గురించి పూర్తిగా పట్టించుకోలేదని రాజ్‌నాథ్‌ విమర్శించారు. వన్‌ ర్యాంక్‌ వన్‌ పింఛన్‌ డిమాండ్‌ను ఆ పార్టీ 40 ఏళ్లుగా పరిష్కరించకుండా వదిలేస్తే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించిందని గుర్తుచేశారు. ఇదే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, భాజపా ప్రభుత్వానికి తేడా అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. రామ మందిర విషయంలో కేవలం తాము నినాదాలకే పరిమితం కాలేదన్నారు. బాబ్రీ ఘటన అనంతరం మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయినా దాన్ని నెరవేర్చిందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉంటామనడానికి ఇదే ఉదాహరణ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని