విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..

కొద్ది సమయంలో గాల్లోకి ఎగరనున్న విమానంలోని ఓ ప్రయాణికుడు తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని షాకివ్వడంతో పైలట్‌ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దిగమని ప్రకటించాడు. ఈ ఘటన దిల్లీలో జరిగిందని విమానయాన సంస్థ అధికారులు శుక్రవారం తెలిపారు. అసలేం జరిగిందంటే.... 6ఈ-286 నెంబర్‌ ఇండిగో ఫ్లైట్ దిల్లీ విమానాశ్రయం నుంచి కొద్ది సమయంలో పుణెకు బయలుదేరనుంది...

Published : 06 Mar 2021 02:18 IST

దిల్లీ: మరికొద్ది నిమిషాల్లో ఆ విమానం గాల్లోకి ఎగరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణీకులందరూ విమానంలోకి వచ్చేశారు. ఇక అనుమతి వస్తే గమ్యస్థానానికి బయలుదేరడమే ఆలస్యం. సరిగ్గా అదే సమయంలో ఓ ప్రయాణికుడు చేసిన ప్రకటనతో అందరూ ఉలిక్కి పడ్డారు. పైలట్‌ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. 6ఈ-286 నెంబర్‌ ఇండిగో విమానం దిల్లీ విమానాశ్రయం నుంచి కొద్ది సమయంలో పుణెకు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, రుజువు కోసం పత్రాలు చూడండంటూ ప్రకటించడంతో విమానంలోని వారందరూ కంగుతిన్నారు. దీంతో అప్రమత్తమైన పైలట్ గ్రౌండ్ కంట్రోలర్స్‌తో రేడియోలో మాట్లాడి అక్కడి పరిస్థితిని వివరించాడు. అనంతరం ఆ వ్యక్తి కూర్చున్న సమీపంలోని 6 నుంచి 8 నెంబర్‌ సీట్ల ప్రయాణీకులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని విమానాశ్రయ అధికారులు సూచించారు. కాగా, ఆ సీట్లను శానిటైజ్‌ చేసి, కొత్త సీటు కవర్‌లు అమర్చారు. దీంతో విమానం కాస్త ఆలస్యంగా బయలుదేరింది. తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఆ వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం సౌత్‌ దిల్లీలోని  ఓ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని