Petrol price: ఆ రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌పై రూ.25లుతగ్గింపు.. షరతులు వర్తిస్తాయ్‌!

లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.25ల మేర ప్రభుత్వం తగ్గించింది. కాకపోతే ఈ అవకాశం కేవలం ద్విచక్రవాహనాలకు మాత్రమేనని స్పష్టం చేసింది.....

Published : 30 Dec 2021 01:23 IST

రాంచీ: ఆకాశాన్నంటిన పెట్రోల్‌ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేలా ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ సంచలన ప్రకటన చేశారు. లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.25ల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. కాకపోతే ఈ అవకాశం కేవలం ద్విచక్రవాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జేఎంఎం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకాయి. నానాటికీ పెరిగిపోతున్న పెట్రో ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేదలు తన ఇంట్లో మోటార్‌ సైకిల్‌ ఉన్నప్పటికీ పెట్రో భారాన్ని భరించలేక దాన్ని వినియోగించలేకపోతున్నాడు. అంతేకాకుండా తన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించేందుకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అందుకే నేనో నిర్ణయం తీసుకున్నా. రేషన్‌ కార్డు కలిగిన ద్విచక్రవాహనదారులు తమ మోటార్‌ సైకిళ్లు, స్కూటర్లలో పెట్రోల్‌ పోయించుకుంటే ఒక్కో లీటర్‌కు ₹25ల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తాం. ఇది 2022 జనవరి 26 నుంచి అందుబాటులోకి వస్తుంది. ప్రతి పేద కుటుంబం నెలకు 10 లీటర్ల వరకు రీయంబర్స్‌మెంట్‌ పొందొచ్చు’’ అని ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.98.52లుగా ఉంది.  

ఈ సందర్భంగా టూరిజం పాలసీ బుక్‌లెట్‌ను విడుదల చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పోషకాహార లోపం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తామని సీఎం తెలిపారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా వారికి స్టూడెంట్‌ క్రెడిట్‌ కార్డులను ఇవ్వనున్నట్టు చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన పిల్లలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

Read latest National - International News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని