Cotton Candy: పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడులో నిషేధం.. ఎందుకంటే..?

Cotton Candy: పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఈమేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శనివారం వెల్లడించారు.

Published : 17 Feb 2024 17:24 IST

చెన్నై: పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది అమితంగా ఇష్టపడే కాటన్‌ క్యాండీ (పీచు మిఠాయి)పై తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ వెల్లడించారు. వీటిల్లో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పీచు మిఠాయి (Cotton Candy) నాణ్యతను పరీక్షించేందుకు ఇటీవల ఫుడ్‌ సేఫ్టీ విభాగ అధికారులు చెన్నై వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో స్వాధీనం చేసుకున్న నమూనాలను అధ్యయనం చేయగా.. కాటన్‌ క్యాండీల్లో రోడమైన్‌-బి అనే కెమికల్‌ను గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగించినట్లు తేలింది.

కిలో వెల్లుల్లి ధర రూ.500.. పొలాల్లో సీసీ కెమెరాలు

సాధారణంగా ఈ రోడమైన్‌-బిని ‘ఇండస్ట్రియల్‌ డై’గా పిలుస్తారు. అంటే దుస్తుల కలరింగ్‌, పేపర్‌ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. ఫుడ్‌ కలరింగ్‌ కోసం దీన్ని ఉపయోగించే అవకాశం లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇది ఎక్కువ మొత్తంలో మన శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, అల్సర్‌ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.

దీంతో పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఈమేరకు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి తయారీ, విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్‌ హెచ్చరించారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాటన్‌ క్యాండీపై నిషేధం అమల్లో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు