Afghanistan: అఫ్గాన్‌ గగనతలం మూసివేత.. విమానాలు వెళ్లలేని పరిస్థితి

తాలిబన్ల అధీనంలో ఉన్న అఫ్గానిస్థాన్‌ నుంచి బయటపడేందుకు వేలాది మంది ప్రజలు కాబూల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు. అటు భారత్‌, అమెరికా సహా పలు దేశాలు

Published : 16 Aug 2021 12:17 IST

దిల్లీ: తాలిబన్ల అధీనంలో ఉన్న అఫ్గానిస్థాన్‌ నుంచి బయటపడేందుకు వేలాది మంది ప్రజలు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు. అటు భారత్‌, అమెరికా సహా పలు దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి. దీంతో కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ కిక్కిరిసిపోయింది. అయితే ప్రస్తుతం ఆ దేశ గగనతలాన్ని మూసివేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో కాబుల్‌కు విమానాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. 

అఫ్గాన్‌ గగనతలాన్ని మూసివేసినట్లు విమానయాన సంస్థలకు నోటీసు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడికి విమానాలను పంపలేకపోతున్నామని ఎయిర్‌ఇండియా వర్గాలు వెల్లడించాయి. ‘‘అఫ్గానిస్థాన్‌ గగనతలాన్ని అన్ని ఎయిర్‌లైన్లకు మూసివేసినట్లు తెలిసింది. అమెరికా నుంచి దిల్లీకి వచ్చే మా విమానాలను అఫ్గాన్‌ మీదుగా వెళ్లకుండా దారిమళ్లిస్తున్నాం. ఆ విమానాలన్నీ దోహా/యూఏఈలో ఇంధనం నింపుకొని దిల్లీకి వస్తాయి. ఇక, ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు కాబుల్‌కు విమానాన్ని పంపాలని అనుకున్నాం. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు’’ అని ఎయిర్ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. చికాగో నుంచి దిల్లీ వస్తోన్న విమానాన్ని గల్ఫ్‌ మీదుగా దారిమళ్లించారు.

ఇక అమెరికా సహా పలు దేశాల విమానాలు కూడా తమ పౌరుల కోసం కాబుల్ విమానాశ్రయంలో ఉన్నాయి. తాజా నిర్ణయంతో అవన్నీ అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. మరోవైపు సంక్షోభం నేపథ్యంలో పలు దేశాలు అఫ్గాన్‌ మీదుగా ప్రయాణించే విమానాలను దారిమళ్లిస్తున్నాయి. ఇప్పటికే కాబుల్‌ విమానాశ్రయం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. వేలాది మంది ప్రజలు నేరుగా విమానాల వద్దకే పరుగులు పెడుతున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని