Sabarimala: వచ్చే వారంలో తెరుచుకోనున్న శబరిమల.. యాత్రికులకు నిబంధనలివే..!

మండల మకరవిళక్కు పండగ సీజన్​ సందర్భంగా శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది. ఈ 16వ తేదీన నుంచి రెండు నెలల పాటు వర్చువల్​ క్యూ విధానంలో.....

Published : 12 Nov 2021 22:02 IST

తిరువనంతపురం: మండల మకరవిళక్కు పండగ సీజన్​ సందర్భంగా శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది. ఈ 16వ తేదీన నుంచి రెండు నెలల పాటు వర్చువల్​ క్యూ విధానంలో రోజుకు 30వేల మంది భక్తులకు అనుమతించనున్నారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్​ సమక్షంలో మరో అర్చకుడు వీకే జయరాజ్​ ఆలయ గర్భగుడిని తెరుస్తారు. అయ్యప్పస్వామి ఆలయం, మల్లికాపురం ఆలయాలకు కొత్తగా ఎంపిక చేసిన అర్చుకులను అధికారికంగా నియమించే ప్రక్రియ అదే రోజు రాత్రి జరగనుంది. 16వ తేదీ నుంచి భక్తులకు అనుమతినిస్తారు. డిసెంబర్​ 26న మండలపూజ ముగుస్తుంది. డిసెంబర్​ 30న మకరవిళక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2022 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేయనున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో కఠినమైన నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

మార్గదర్శకాలు ఇవే..

* కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారు అధికారులకు ఆ​ సర్టిఫికెట్​ చూపించాలి. లేకపోతే శబరిమలను సందర్శించుకునే 72 గంటల ముందు ఆర్​టీపీసీఆర్​ పరీక్ష చేసుకోవాలి. ఆ నెగిటివ్​ రిపోర్టును అధికారులకు సమర్పించాలి.

* దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఆలయానికి రావాలి.

* ప్రతి ఒక్కరూ ఒరిజినల్​ ఆధార్​ తప్పనిసరిగా చూపించాలి.

* పంపాలో స్నానానికి అనుమతి ఉంది. కానీ పంపా, సన్నిధానంలో బస చేసేందుకు అనుమతులు లేవు. పంపాలో వాహనాలకు పార్కింగ్​ వెసులుబాటు కూడా ఉండదు. దర్శనం తర్వాత ప్రసాదం కోసం పంపా వద్ద ఏర్పాట్లు చేశారు.

* దర్శనం ముగించుకున్న వెంటనే ఆలయ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలి.

* నెయ్యాభిషేకం కోసం భక్తులు తీసుకొచ్చే నెయ్యిని సేకరించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడే నెయ్యిని తిరిగి ఇస్తారు.

చితిర అట్టవిశేష పూజ కోసం శబరిమల ఆలయాన్ని ఈ నెల 3న తెరిచారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయం తలుపులు తెరిచిన పండితులు.. స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందస్తు బుకింగ్ చేసుకున్నవారికి స్వామివారిని దర్శించుకునే అవకాశం దక్కింది. పూజా కార్యక్రమాలు పూర్తి చేసి అదే రోజు రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని