బ్యాండేజ్‌తో కనిపించిన న్యాయవాది.. ఆరా తీసిన సీజేఐ.. ఆ తర్వాత!

వాదనలు వింటోన్న సమయంలో బ్యాండేజ్‌తో కనిపించిన న్యాయవాది ఆరోగ్యం గురించి సీజేఐ(CJI) అడిగి తెలుసుకున్నారు. ఆయనకు వైద్య సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు.  

Published : 11 Sep 2023 17:45 IST

దిల్లీ: ఈ మధ్యకాలంలో వీధికుక్కల(Stray Dogs) దాడిలో చిన్నారులు మృతి చెందిన ఘటనలు తరచూ వింటున్నాం. ఈ సమస్య ఈ రోజు సుప్రీంకోర్టు(Supreme Court)లో ప్రస్తావనకొచ్చింది. ఒక న్యాయవాది బ్యాండేజ్‌తో కనిపించడమే ఈ చర్చకు దారితీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

సోమవారం సుప్రీంకోర్టు(Supreme Court)లో ఓ న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ సమయంలో ఆయన బ్యాండేజ్‌ వేసుకొని ఉండటం ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్‌ డీవై చంద్రచూడ్ దృష్టిలోపడింది. దాంతో వెంటనే ఏమైందంటూ న్యాయవాదిని ప్రశ్నించగా.. వీధి కుక్కల దాడిలో గాయపడినట్లు ఆయన చెప్పారు. తన ఇంటి దగ్గర్లోనే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. దాంతో అవసరమైతే వెంటనే ఆయనకు వైద్య సహాయం అందించాలని ప్రధాన న్యాయమూర్తి సిబ్బందికి సూచించారు. గతంలో తన సిబ్బంది ఎదుర్కొన్న దాడి గురించి గుర్తుచేసుకున్నారు.

సుమారు 200 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం వేచి చూస్తున్నారు : నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌

ఈ సమయంలో సీనియర్ లాయర్ విజయ్ హన్సారియా మాట్లాడుతూ.. వీధికుక్కల సమస్యపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అందుకు సీజేఐ సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో కుక్కకాటుకు గురైన నెల రోజుల తర్వాత రేబిస్‌ బారినపడటంతో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వ్యాధి తీవ్రం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.  తండ్రి చేతుల్లోనే ఆ పిల్లాడు మృతి చెందాడు. ఇదే విషయాన్ని సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా ఈ సందర్భంగా కోర్టులో ప్రస్తావించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని