PM Modi: ప్రపంచ ఆర్థికాభివృద్ధికి మూల స్తంభంగా భారత్‌: ప్రధాని మోదీ

ప్రపంచ ఆర్థికాభివృద్ధికి మూల స్తంభంగా భారత్‌ను అంతర్జాతీయ సమాజం చూస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

Published : 10 Jan 2024 16:01 IST

గాంధీనగర్‌: భవిష్యత్తులో ప్రపంచంలోనే తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. బుధవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ‘గుజరాత్‌ అంతర్జాతీయ సదస్సు 2024’లో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాక భారత్‌-యూఏఈ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు. 

‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో స్థిరత్వానికి మూల స్తంభంగా, విశ్వమిత్రగా (ప్రపంచ దేశాల మిత్రుడిగా), సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలిగే సాంకేతిక కేంద్రంగా, ప్రతిభావంతులైన యువత కలిగిన శక్తివంతమైన కేంద్రంగా భారత్‌ను అంతర్జాతీయ సమాజం చూస్తోంది. ఉమ్మడి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించగలమనే భావనను ప్రపంచ దేశాలకు భారత్‌ కలిగించింది. ఇటీవలే భారత్‌ 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను చేసుకుంది. రాబోయే 25 ఏళ్లు భారత్‌కు అమృత కాలం. ఈ 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలో భారత్‌ మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనేందుకు నాది భరోసా’’ అని ప్రధాని మోదీ తెలిపారు. 

ప్రధాని నాయకత్వంపై అంబానీ ప్రశంసలు

భారత చరిత్రలో నరేంద్ర మోదీ అత్యంత విజయవంతమైన ప్రధాని అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అన్నారు. గుజరాత్‌ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన.. ప్రధాని నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ‘‘భారతీయులు ఎక్కువగా ‘మోదీ హైతో ముమ్‌కిన్‌ హై’ (మోదీ ఉంటే సాధ్యమే) అని ఎందుకు అంటున్నారని విదేశాల్లోని మిత్రులు నన్ను అడుగుతారు. దానికి నేను చెప్పే సమాధానం.. భారత ప్రధాని తన సంకల్పంతో సవాళ్లను అధిగమించి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేశారు. అందుకే భారతీయులు మోదీ హైతో ముమ్‌కిన్‌ హై అంటారని చెప్పా’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని