శ్రావణి ఆత్మహత్యకు ముందు అసలేం జరిగింది?

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

Published : 12 Sep 2020 16:00 IST

ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు ముమ్మర దర్యాప్తు

హైదరాబాద్‌: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవరాజ్‌ రెడ్డిని పోలీసులు మూడో రోజూ విచారిస్తున్నారు. మరో అనుమనితుడిగా ఉన్న సాయి కృష్ణారెడ్డిని ఆదివారం ఉదయం విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే సాయికృష్ణా రెడ్డికి పోలీసులు నోటీసులు పంపినప్పటికీ శ్రావణి అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమంలో ఉన్నందున తర్వాత వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అతడు ఈ రోజు కూడా అక్కడే ఉండటంతో సాయంత్రం లోపు వస్తాడని సమాచారం. దీంతో సాయిని రేపు విచారించే అవకాశం ఉంది. 

దేవరాజ్‌ సమర్పించిన ఫోన్‌ కాల్‌ రికార్డులతో పాటు అతడు పోలీసు విచారణలో చెప్పిన పలు విషయాలు ఆధారంగా సాయి కృష్ణారెడ్డిని ప్రశ్నించనున్నారు. ఆత్మహత్యకు ముందు శ్రావణి దేవరాజ్‌కు ఫోన్‌ చేయడంతో ఆ సంభాషణకు సంబంధించిన ఆధారాలను కూడా అతడు పోలీసులకు అందజేశాడు. దీంతో ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవే జరిగినట్టు పోలీసులు గుర్తించారు. శ్రావణిని కుటుంబ సభ్యులు, సాయి దూషించడంతో పాటు ఆమెపై కుటుంబ సభ్యులు చేయి చేసుకున్నట్టుగా ఫోన్‌ రికార్డులో ఉంది. ఆ సమయంలో శ్రావణి దేవరాజ్‌కు ఫోన్‌ చేసి అలాగే ఉంచడంతో వారి మధ్య వాగ్వాదం.. దూషణలు.. సోదరుడు శ్రావణిపై చేయి చేసుకోవడం అన్నీ రికార్డయ్యాయి. వీటిని పోలీసులకు దేవరాజ్‌ అందజేయడంతో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అలాగే, ఆత్మహత్యకు ముందు రోజు శ్రావణి - దేవరాజ్‌ ఓ రెస్టారెంట్‌లో ఉన్నట్టు తెలుసుకున్న సాయి అక్కడికి వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగిన వీడియో ఫుటేజీని కూడా పోలీసులు సేకరించారు. ఈ ఆధారాలు సేకరించిన పోలీసులు అసలు ఆత్మహత్యకు దారితీసిన ప్రధాన కారణాలేమిటనే దానిపై ముఖ్యంగా విశ్లేషిస్తున్నారు.

ఈ కేసులో ఎవరిని నిందితుడిగా చేర్చాలనే అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. అసలు శ్రావణి కుటుంబానికి, సాయి కృష్ణారెడ్డికి పరిచయం ఎలా ఏర్పడింది? శ్రావణితో అతడికి ఉన్న స్నేహమేంటి? కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పట్ల సాయి అలా ప్రవర్తించడానికి కారణాలు ఏమిటి? దేవరాజ్‌తో ఆమె సన్నిహితంగా ఉంటే ఎందుకు కోపం వచ్చింది? దేవరాజ్‌ను ప్రశ్నించడం.. బెదిరింపులకు పాల్పడటం ఎందుకు చేశాడు తదితర కోణాల్లోనూ విచారించి అన్ని అంశాలను విశ్లేషించి ఈ కేసులో ఓ స్పష్టతకు రానున్నారు. దేవరాజ్‌ వ్యవహార శైలి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందంటూ అతడిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో మూడు రోజులుగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, శ్రావణికి కుటుంబ సభ్యులు దూషించడం, కొట్టడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందన్న కాల్‌ రికార్డింగ్‌ ఆధారాలను దేవరాజ్‌ పోలీసులకు సమర్పించాడు. ఈ నేపథ్యంలో సాయి కృష్ణారెడ్డిని ప్రశ్నించిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని