ఈ వైరం... ఆ తీరం

కథానాయకుడికి తగిన జోడీ ఎంత ముఖ్యమో... సై అంటే సై అంటూ ఢీ కొట్టే ప్రతినాయకుడూ అంతే కీలకం. సినిమాలో హీరోయిజం పండాలంటే, హీరోకి ప్రత్యర్థిగా కనిపించే విలన్‌ దీటుగా ఉండాల్సిందే. రాజమౌళి సహా కొద్దిమంది దర్శకులు విలన్‌ పాత్రలపై ప్రత్యేకమైన ప్రేమని కనబరుస్తుంటారు. హీరోని మించి ఆ పాత్రల్ని తీర్చిదిద్దుతుంటారు. ఆయా  దర్శకుల సినిమాల్లోని హీరోల గురించి ఎంతగా మాట్లాడుకుంటామో...

Updated : 20 Aug 2021 07:02 IST

కథానాయకుడికి తగిన జోడీ ఎంత ముఖ్యమో... సై అంటే సై అంటూ ఢీ కొట్టే ప్రతినాయకుడూ అంతే కీలకం. సినిమాలో హీరోయిజం పండాలంటే, హీరోకి ప్రత్యర్థిగా కనిపించే విలన్‌ దీటుగా ఉండాల్సిందే. రాజమౌళి సహా కొద్దిమంది దర్శకులు విలన్‌ పాత్రలపై ప్రత్యేకమైన ప్రేమని కనబరుస్తుంటారు. హీరోని మించి ఆ పాత్రల్ని తీర్చిదిద్దుతుంటారు. ఆయా  దర్శకుల సినిమాల్లోని హీరోల గురించి ఎంతగా మాట్లాడుకుంటామో... విలన్‌ గురించీ అంతే! ఆ మేజిక్‌ని చూసి ఇతర దర్శకులూ అదే పద్ధతిని అనురిస్తుంటారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బలమైన విలన్లని ఎంపిక చేసుకుంటున్నారు. అందుకే తెలుగు సినిమాల్లో అటు హిందీ, భోజ్‌పురి నటులు మొదలుకొని ఇటు బెంగాల్‌కి చెందిన జిషూ సేన్‌ గుప్తా వరకు ఎంతోమంది మన హీరోల్ని ఢీ కొట్టేందుకు వస్తున్నారు.

రామ్‌చరణ్‌ శంకర్‌ సినిమాలో నాయిక ఎవరన్నది ఖరారైంది. ఇక తేలాల్సింది ప్రతినాయకుడే. ప్రభాస్‌ - ప్రశాంత్‌ నీల్‌ చేస్తున్న ‘సలార్‌’లో విలనిజం బాధ్యత ఎవరనేది అధికారికంగా ఖరారు కాలేదు. చిరంజీవి, బాలకృష్ణలకీ విలన్లు కావాలి. కొన్నాళ్లుగా విలన్‌ ఎంపిక పనిలోనే ఉన్న ఆయా చిత్రబృందాలు ఓ నిర్ణయానికొచ్చాయని పరిశ్రమ వర్గాలు చెప్పుకొంటున్నాయి.


బాలకృష్ణ కోసం విజయ్‌ సేతుపతి?

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందనున్న ఆ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం తమిళ నటుడు విజయ్‌ సేతుపతిని సంప్రదించారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘లూసిఫర్‌’ రీమేక్‌లో ప్రతినాయకుడిగా ఓ హీరో కనిపిస్తారని తెలిసింది. మలయాళంలో ఆ పాత్రని హిందీ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ చేశారు. మరి ఆయన్నే తెలుగులో రంగంలోకి దించుతారేమో చూడాలి.


బన్నీ విలన్‌తోనే చరణ్‌ ఢీ

విలన్‌ పాత్రల కోసం కథానాయకుల్నే రంగంలోకి దింపడం కొత్త ట్రెండ్‌. రానా దగ్గుబాటి, ఆది పినిశెట్టి, ఆర్య తదితరులు ప్రతినాయకులుగా కనిపించి సత్తా చాటిన విషయం తెలిసిందే. ‘పుష్ప’ కోసం మలయాళ స్టార్‌ ఫహాద్‌ ఫాజిల్‌ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ వారంలోనే చిత్రీకరణలో పాల్గొనున్నారాయన. బన్నీని ఢీ కొట్టే ఫహాద్‌ తదుపరి రామ్‌చరణ్‌కీ విలన్‌గా కనిపిస్తారని సమాచారం. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్‌గా ఫహాద్‌ ఎంపికయ్యారని తెలిసింది. శంకర్‌ సినిమాల్లో ప్రతినాయక పాత్రలు ఓ రేంజ్‌లో ఉంటాయి. మరి ఫహాద్‌ని శంకర్‌ ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.


ఫ్యామిలీమేన్‌తో ప్రభాస్‌ ఫైట్‌!

ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్‌ కథానాయిక. ప్రభాస్‌ డాన్‌గా కనిపిస్తారని సమాచారం. ఇందులో ఆయన్ని ఢీ కొట్టే ప్రతినాయకుడిగా ‘ఫ్యామిలీమేన్‌’ ఫేమ్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌ని ఎంపిక చేశారని సమాచారం. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ని చిత్రీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని