నవరస నాయకుడు.. నందమూరి అందగాడు

తెలుగు తెరపై సీనియర్‌ ఎన్టీఆర్‌ ధృవతారగా వెలిగితే.. ఆ వారసత్వాన్ని..నటనా కౌశలాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న కథానాయకుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. నునుగు మీసాల వయసులోనే బాక్సాఫీస్‌ రికార్డులు...

Published : 20 May 2021 09:05 IST

తెలుగు తెరపై అలనాటి నటుడు ఎన్టీఆర్‌ ధ్రువతారగా వెలిగితే.. ఆ వారసత్వాన్ని.. నటనా కౌశలాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న కథానాయకుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. నూనుగు మీసాల వయసులోనే బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాసిన ఈ నందమూరి బుల్లోడు. తేనెలొలుకు తెలుగును అంతే తీయగా పలికించి తెలుగువాళ్ల హృదయాలను దోచుకుంటున్నాడు.  తెలుగునాట నవరసాలను అలవోకగా పలికించగల నటుల్లో తారక్‌ మొదటి వరుసలో ఉంటాడనడంలో సందేహం లేదు. గురువారం ఎన్టీఆర్‌ పుట్టినరోజు. ఇన్నేళ్లకాలంలో ఎన్టీఆర్‌ నవరసాలను పలికించిన తీరుని..అభిమానులను అలరించిన వైనాన్ని ఓ సారి గుర్తుచేసుకుందాం..

హాస్యం.. నవ్వుల నటరాజు...

‘అల్లరి రాముడు’లో కొన్ని సన్నివేశాల్లో నవ్వుల పూయించిన తారక్‌ పూర్తిగా హాస్య ప్రాధాన్యమున్న పాత్ర చేసింది ‘అదుర్స్‌’లోనే. అందులో బ్రహ్మానందంతో కలిసి చేసిన అల్లరికి థియేటర్లలో నవ్వులతో పాటు కలెక్షన్లు భారీగానే కురిశాయి.  శ్రీనువైట్లతో చేసిన ‘బాద్‌షా’, సంతోష్‌ శ్రీనివాస్‌ ‘రభస’లోనూ తనదైన శైలిలో నవ్వులు పంచారు.

అద్భుతం.. అభినయం..

సినీ జీవితంలో ఎన్నో మరపురాని పాత్రలను పోషించిన తారక్‌.. ‘సింహాద్రి’ తర్వాత అనుకున్న స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాడు. మూడేళ్లపాటు విజయం కోసం ఎదురుచూశారు. ‘యమదొంగ’ రూపంలో బంపర్‌హిట్‌ కొట్టడమే కాదు, సోషియా ఫాంటసీ చిత్రంతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. అందులో యంగ్‌ యముడిగా ఎన్టీఆర్‌ అభినయం, ఆయన పలికించిన ఆ సంభాషణాలు చూస్తే సాక్షాత్తూ.. పెద్ద ఎన్టీఆర్‌ దిగొచ్చినట్లుందని మురిసిపోయారు అభిమానులు.

భ.. భ.. భయపెట్టారు

న నటనతో తోటి నటులకు గట్టి పోటీనిస్తాడన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఎంచుకున్న పాత్రలు ప్రేక్షకులను సైతం భయపడేలా చేశాయి. ‘జై లవకుశ’లో త్రిపాత్రాభినయంలో మెప్పించడమే కాదు, ‘రావణ’ పాత్రలో ఎన్టీఆర్‌ చూపించిన క్రౌర్యానికి మంచి మార్కులే పడ్డాయి. అందులో జైగా అసూయ, కోపంతో రగిలిపోయే సోదరుడిగా అదరగొట్టాడు తారక్‌.

వెంటపడ్డాడా.. ఓబా బీభత్సమే!

న్టీఆర్‌లోని బీభత్స నటుడిని ఆవిష్కరించిన సన్నివేశాలెన్నో ఆయన చిత్రాల్లో ఉన్నాయి. ‘ఆది’ మొదలుకొని, ‘సింహాద్రి’, ‘శక్తి’, ‘రామయ్య వస్తావయ్యా’ ఇలా శత్రువులను ఊచకోత కోసి బీభత్సం తనదైన శైలిలో ప్రదర్శించారు. ‘అరవింద సమేత’లో మొండికత్తితో శత్రువులను వెంటాడుతూ వేటాడే సీన్‌ ఎవర్‌గ్రీన్‌. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కొమురం భీమ్‌గా అలరించడానికి సిద్ధమవుతున్నారు.

కన్నీళ్లతో గుండెలను తడిమిన ‘రాఖీ’

రాఖీలో చెల్లెలి ప్రాణం కోసం తాపత్రాయపడే అన్నగా కరుణ రసాన్ని పండించాడు తారక్‌. అందులో అన్నాచెల్లెళ్ల సెంటిమెంటుతో థియేటర్‌కొచ్చిన ప్రేక్షకుల కన్నీళ్లు పెట్టించాడు. ఆలాగే నాన్నకు ప్రేమతోలోని అభిరామ్‌ పాత్రతో కూడా అభిమానుల కళ్లను చెమ్మగిల్లేలా చేశాడాయన.

కత్తిదూస్తే అర ‘వీర భయంకరమే’

యన కెరియర్‌లో చేసిన చాలా పాత్రలకు ఆవేశమెక్కువే. వీరత్వాన్ని ప్రదర్శించే పాత్రలే సింహభాగం ఉన్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ‘సింహాద్రి’. సింగమలైగా వీరత్వాన్ని ప్రదర్శించాడు. అరవింద సమేతలో మొండి కత్తి దూస్తూ శత్రువులకు సవాలు విసిరిన తారక్‌.. దమ్ము, ఆది సినిమాల్లో పోషించిన ఆయా పాత్రల్లోని వీరత్వాన్ని అవలీలగా పలికించారాయన.

లవర్‌బాయ్‌లా కనిపిస్తాడంతే.. !

కెరియర్‌లో మొదటి హిట్టు బొమ్మ ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’. అందులో కాలేజీ విద్యార్థిగా ఎంతో శాంతంగా ఉండే ఎన్టీఆర్‌ జైలుకెళ్లాక కూడా ఖైదీల్లో పరివర్తన తెచ్చే పాత్రలో  మెప్పించారు. ‘బృందావనం’లో ఆయన పాత్ర కూల్‌గానే ఉంటుంది.

జర జరా.. అంటూ..

న్టీఆర్‌ తొలి నుంచీ మాస్‌ కథానాయకుడిగానే ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు. దీంతో ఆయన చేసిన రొమాంటిక్‌ సినిమాలు తక్కువే. కథానాయికలతో ఆడిపాడినప్పుడు ‘రాఖీ’లో ఇలియానాతో వచ్చే జరజర, ‘జై లవ కుశ’లో నివేదా థామస్‌తో పాటలోనూ శృంగార రసాన్ని తనదైన శైలిలో పండించారు.

‘ఆర్ఆర్‌ఆర్‌’లో రుద్ర తాండవే!

ళ్లతోనే రౌద్రాన్ని పలికించే నటుడు తారక్‌. ‘సింహాద్రి’ నుంచి ‘అరవింద సమేత’వరకూ చాలా సినిమాల్లో ఆయన పలకించిన ‘రౌద్రం’ అభిమానులను విశేషంగా అలరించింది. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ‘కొమురం భీమ్‌’గా ఆ రౌద్ర రసాన్ని తారస్థాయికి తీసుకెళ్తారనడంలో సందేహం లేదు.

 

సినిమాకొచ్చిన ప్రేక్షకుడిని భావోద్వేగాల తడిలో ముంచెత్తడంలో ఈ నవరసాలదే ముఖ్యపాత్ర. నవ్వు, ఏడుపు, కోపం, బాధ.. ఇలా భావమేదైనా అందులో ప్రేక్షకుడిని  పూర్తిగా లీనం చేసినట్లైతే నటుడిగా పరిపూర్ణత సాధించినట్లే.. అలా చూసుకుంటే టాలీవుడ్‌లో  నేటితరం హీరోల్లో ఎన్టీఆర్‌ సంపూర్ణ నటుడనడంలో సందేహమేముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని