Esha Deol: పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం: ఈషా దేవోల్‌

బాలీవుడ్‌ నటి ఈషా దేవోల్‌ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Published : 07 Feb 2024 15:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హేమమాలిని కుమార్తె ఈషా దేవోల్‌ (Esha Deol) తన భర్త భరత్‌ తఖ్తానీతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచారు. 11 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సంయుక్తంగా మీడియాకు తెలిపారు. ‘‘మేము పరస్పర అంగీకారంతో స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా పిల్లలు రాధ్య, మీరియాలకు మేమేప్పుడూ ప్రాధాన్యమిస్తాం. దయచేసి అందరూ మా నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఈషా, భరత్‌లు 2012లో వివాహం చేసుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈషా తన భర్త భరత్‌ను ఎలా కలిశారో తెలిపారు. ‘‘మేము ఓ పాఠశాలలో జరిగే క్యాస్కేడ్‌ ఇంటర్‌-స్కూల్‌ పోటీల్లో కలుసుకున్నాం. నా ఫోన్‌ నంబర్‌ను ఇచ్చాను. మా అమ్మ గదిలో ఒకటే ఫోన్‌ ఉండేది. దానితో మేమిద్దరం ఎక్కువ సమయం మాట్లాడేందుకు వీలుండేది కాదు. కెరీర్‌ ప్రారంభమైన కొన్ని రోజులకు భరత్‌ నా జీవిత భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని అప్పట్లో ఈషా తెలిపారు. 

‘కొయి మేరో దిల్‌ సే పూచే’(Koi Mere Dil Se Poochhe) సినిమాతో 2002లో ఈషా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ‘ధూమ్‌’( Dhoom)తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో  పాటు షార్ట్‌ఫిల్మ్‌ల్లో, రియాలిటీ షోలతోనూ అలరిస్తున్నారు. ‘అమ్మా మియా స్టోరీస్‌’, ‘అడ్వైస్‌ ఎండ్‌ రెసిపీస్‌ వన్‌ మదర్‌ టు ఎనదర్‌’ అనే పుస్తకాలను రచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని