సంక్షిప్త వార్తలు(4)

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక రాణీ ముఖర్జీ నటిస్తోన్న కొత్త చిత్రం ‘మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’. ముందు అనుకున్న ప్రకారం ఈ సినిమా మార్చి 3న విడుదల కావాల్సి ఉంది.

Updated : 27 Jan 2023 06:43 IST

పిల్లల కోసం పోరాటం

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక రాణీ ముఖర్జీ నటిస్తోన్న కొత్త చిత్రం ‘మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’. ముందు అనుకున్న ప్రకారం ఈ సినిమా మార్చి 3న విడుదల కావాల్సి ఉంది. కానీ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నుట్లు ఓ కొత్త పోస్టర్‌తో ప్రకటించింది చిత్రబృందం. సరస్వతి పూజలో పిల్లలతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న రాణీ ముఖర్జీని ఇందులో చూడొచ్చు. తన పిల్లలను తన కస్టడీకి తెచ్చుకోవడానికి నార్వేజియన్‌ ఫోస్టర్‌ కేర్‌ సిస్టిమ్‌, స్థానిక యంత్రాంగంతో పోరాటం చేసే భారతీయ వలస మహిళగా రాణీ ఇందులో నటిస్తున్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు వినోదం పంచడమే కాదు మంచి సందేశాన్ని కూడా అందిస్తుందని’’ చెబుతోంది రాణి. ఆషియా చిబ్బర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


నీ ఆలోచనలే నీ శత్రువులు

‘పలాస’ చిత్రంతో సినీప్రియుల్ని మెప్పించిన హీరో రక్షిత్‌ అట్లూరి. ఇప్పుడాయన ‘ఆపరేషన్‌ రావణ్‌’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వెంకట సత్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ధ్యాన్‌ అట్లూరి నిర్మించారు. సంగీర్తన విపిన్‌ కథానాయిక. రాధికా శరత్‌కుమార్‌, చరణ్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మేఘా అండ్‌ ఒమేఘా విద్యా సంస్థల వైస్‌ చైర్‌పర్సన్‌ మాలతి రెడ్డి విడుదల చేశారు. ‘నీ ఆలోచనలే నీ శత్రువులు’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఆ ప్రచార చిత్రంలో రక్షిత్‌ సీరియస్‌ లుక్‌తో కనిపించారు. ‘‘న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్‌, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.


మదిని హత్తుకునే.. సోదర సోదరీమణులు

మల్‌ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో రఘుపతి రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా’. విజయ్‌ కుమార్‌ పైండ్ల నిర్మాత. కాలకేయ ప్రభాకర్‌, పృథ్వీరాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో గురువారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘‘హృదయాల్ని హత్తుకునే చక్కటి కుటుంబ కథాంశంతో రూపొందిన చిత్రమిది. 35రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: మదీన్‌ ఎస్‌.కె, ఛాయాగ్రహణం: మోహన్‌ చారి.


భాయీజాన్‌ ఆగయా!

ల్మాన్‌ ఖాన్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. యాక్షన్‌తో కుటుంబ బంధాలకు ప్రాధాన్యమిస్తూ తెరకెక్కిన ఇటీవలే ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఓ పక్క కుటుంబ సన్నివేశాల్లోనూ మెప్పిస్తూనే యాక్షన్‌ కూడా ఇరగదీశాడు సల్మాన్‌ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. వెంకటేష్‌తో పాటు జగపతిబాబు కీలక పాత్రలో నటించిన చిత్రమిది. ‘‘మీ పేరేంటి అంటే..నా కంటూ పేరు లేదు. కానీ నన్ను అందరూ భాయిజాన్‌ అని పిలుస్తారు’ లాంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఈ టీజర్‌ను పంచుకుంటూ సరైంది ఎప్పుడూ సరైందే..తప్పు తప్పే అని రాశారు సల్మాన్‌. ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఈద్‌ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని