‘షారుఖ్‌ ఎక్కడికి వెళ్లిపోలేదు.. బాక్సాఫీస్‌ని రూల్‌ చేయడానికి టైమ్‌ కోసం ఎదురుచూశాడు’

‘పఠాన్‌’ (Pathaan)పై ప్రశంసల వర్షం కురిపించారు కరణ్‌ జోహార్‌ (Karan Johar). సినిమా సూపర్‌ హిట్‌ అంటూ మెచ్చుకున్నారు. బాక్సాఫీస్‌ ఏలడానికి సరైన సమయం కోసం షారుఖ్‌ ఇంతకాలం వేచి ఉన్నట్లు ఆయన అన్నారు.

Updated : 26 Jan 2023 13:02 IST

ముంబయి: షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన ‘పఠాన్‌’ (Pathaan)పై ప్రశంసల వర్షం కురిపించారు బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్ (Karan Johar)‌. ఇదొక బ్లాక్‌ బస్టర్‌ అంటూ కితాబిచ్చారు. చిత్రబృందం పనితీరును మెచ్చుకున్నారు. సల్మాన్‌ - షారుఖ్‌ సన్నివేశాలు వచ్చినప్పుడు తాను నిల్చొని చప్పట్లు కొట్టినట్లు చెప్పారు. సినిమా మొత్తానికి ఆ సీన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా ఉన్నట్లు తెలిపారు.

‘‘చివరిగా సినిమాలు చూస్తూ ఎప్పుడు ఎంజాయ్‌ చేశానో నాకు అంతగా గుర్తు లేదు. పఠాన్‌ (Pathaan) ఇదొక బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌. మెగా అనే పదం దీనికి సరిగ్గా సరిపోతుంది. షారుఖ్‌.. లుక్స్‌, స్టార్‌డమ్‌, నటన, అద్భుతమైన ఏజెంట్‌గా దీపికా పదుకొణె, ప్రతినాయకుడిగా జాన్‌ అబ్రహం అదరగొట్టేశారు! సిద్ధ్‌ ఆనంద్‌ దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులను ఆకర్షించేలా సినిమాలు చేయడంలో నిపుణులైన కొద్దిమందిలో సిద్ధార్థ్‌ కూడా ఒకరు. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఆదిత్య చోప్రాకు అభినందనలు. అతడిని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. కాకపోతే, సినిమాపట్ల అతడికి ఉన్న విజన్‌ అద్భుతం. ఇక కింగ్‌ గురించి చెప్పాలంటే ఆయన ఎక్కడికి వెళ్లిపోలేదు. బాక్సాఫీస్‌ను రూల్‌ చేయడానికి సరైన సమయం కోసం వేచి చూశాడు. ఇప్పటి వరకూ మీరు ఎన్నో విమర్శలు, బహిష్కరణలు ఎదుర్కొని ఉండొచ్చు కానీ, మీ దారిలో మీరు వచ్చినప్పుడు ఆ మార్గంలో ఎవరూ నిలబడలేరు అనేది ఎవరూ కాదనలేరు. సల్మాన్‌ - షారుఖ్‌ కలిసి ఉన్న సన్నివేశాలు నాకు బాగా నచ్చేశాయి. ఆ సీన్స్‌ వచ్చినప్పుడు నిల్చొని చప్పట్లు కొట్టాను’’ అని కరణ్‌ జోహార్‌ పేర్కొన్నారు.

‘రా’ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘పఠాన్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకుడు. ఆదిత్య చోప్రా నిర్మాత. ‘జీరో’ పరాజయంతో సుమారు నాలుగేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న షారుఖ్‌ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీపికా పదుకొణె కథానాయిక. సల్మాన్‌ అతిథి పాత్రలో నటించారు. బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతటా మంచి టాక్‌ అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని