Sarath Babu: శరత్‌ బాబు ఒంటరితనాన్ని, మౌనాన్ని ప్రేమించాడు : పరుచూరి గోపాలకృష్ణ

ఇటీవల మరణించిన నటుడు శరత్‌ బాబును (Sarath Babu) ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ (Paruchuri Gopala Krishna) గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. 

Updated : 01 Jun 2023 14:14 IST

హైదరాబాద్‌: దివంగత నటుడు శరత్‌ బాబు ఒంటరితనాన్ని ప్రేమించాడని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఆయన ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేదని.. అలాంటి గొప్ప నటుడు మన మధ్య లేరనే వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్లు పరుచూరి (Paruchuri Gopala Krishna) తెలిపారు. శరత్‌ బాబుతో (Sarath Babu) ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ ప్రత్యేక వీడియో చేశారు.

‘‘ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటులంతా వెళ్లిపోతుంటే ఎంతో బాధగా ఉంది. శరత్‌ బాబు మా ఇంటికి సమీపంలో ఉండేవారు. ప్రతిరోజూ వాకింగ్‌ చేస్తున్నప్పుడు కనిపించే వారు. ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉండేవారు. ఆయనకు నవ్వు దేవుడిచ్చిన వరం. ఈ మాటను ఎన్నోసార్లు ఆయనతో చెప్పాను. ఆయనతో కలిసి నేను ఎన్నో సినిమాలకు పనిచేశాను. ఆయన అనారోగ్య కారణంతో హాస్పటల్‌లో చేరారని తెలియగానే త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించిన వారిలో నేనూ ఒకడిని. మనకున్న అతికొద్దిమంది సహజ నటుల్లో శరత్‌బాబు ఒకరు. ఎన్నో భాషల్లో నటించారు. ఒక తెలుగు నటుడు ఐదు భాషల్లో ప్రేక్షకులను అలరించాడంటే మాములు విషయం కాదు. అద్భుతమైన పాత్రలు చేశారు.

పవన్‌ కల్యాణ్‌ (pawan kalyan) సినిమాలో శరత్‌ బాబును చూసినప్పుడే ఆయన ఆరోగ్యం బాలేదేమో అని నాకు అనిపించింది. ఆయన వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. కొంతమంది మనస్తత్వాలు చాలా భిన్నంగా ఉంటాయి. తట్టుకోలేని స్థాయిలో బాధలు వస్తే సన్యాసం తీసుకుంటారు. కానీ, శరత్‌ బాబు గారు అలా చేయలేదు. ఒంటరితనంలోకి వెళ్లారు. ఆ ఒంటరితనాన్ని, మౌనాన్ని ప్రేమించారు. ఆ మౌనంలో కన్నీరు పెట్టుకున్నారేమో గానీ, బయట ఎప్పుడూ బాధపడలేదు. ఆయన అలాంటి మహానుభావుడు’’ అని శరత్‌ బాబును గుర్తుతెచ్చుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు పరుచూరి గోపాలకృష్ణ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని