SS Rajamouli: త్వరలో షూటింగ్‌.. మహేశ్‌ మూవీపై జక్కన్న అప్‌డేట్‌

మహేశ్‌ బాబుతో తాను చేయబోయే చిత్రం గురించి రాజమౌళి జపాన్‌ మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. 

Updated : 19 Mar 2024 11:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్‌లో రానున్న సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఇటీవల జపాన్‌ వెళ్లిన దర్శకుడు రాజమౌళి స్థానిక మీడియాతో మాట్లాడుతూ ‘‘మహేశ్‌ బాబుతో సినిమా చేస్తున్నా. ఆయన మంచి నటుడు. చాలా అందంగా ఉంటారు. మీలో కొందరికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలో చిత్రీకరణను ప్రారంభిస్తాం. వేగంగా నిర్మాణం పూర్తి చేసి మహేశ్‌బాబును ఇక్కడికి తీసుకురావాలని భావిస్తున్నా’’ అని వెల్లడించారు. 

రామ్‌చరణ్‌ (Ram Charan), జూనియర్‌ ఎన్టీఆర్‌(NTR) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR). దీనిని దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. దీనిలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా జపాన్‌లో గతేడాది విడుదలైంది. ఇటీవల అక్కడి ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించేందుకు రాజమౌళి జపాన్‌ వెళ్లారు. వారి అభిమానాన్ని ప్రశంసిస్తూ ఎక్స్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘జపాన్‌వాసులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అక్కడి ప్రజలు తమకు ఇష్టమైనవారికి ‘ఆర్గామి క్రేన్స్‌’ను బహూకరించడం సంప్రదాయం. ఈ చిత్రాన్ని వీక్షించిన 83 ఏళ్ల వృద్ధురాలు నాకు దానిని ఆప్యాయంగా ఇచ్చారు. అందుకోసం థియేటర్‌ బయట ఆమె కొన్ని గంటలు ఎదురుచూశారు. వారి అభిమానానికి కృతజ్ఞతలు’’ అని రాజమౌళి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని