Tollywood: టాలీవుడ్‌లో ఈరోజు హాట్‌ అండ్‌ స్వీట్‌ న్యూస్‌ ఇవే!

తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల జోరు పెరిగింది. కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా, మరికొన్ని షూటింగ్‌ పూర్తి చేసుకున్నాయి. మంగళవారం

Published : 05 Oct 2021 14:52 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల జోరు పెరిగింది. కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా, మరికొన్ని షూటింగ్‌ పూర్తి చేసుకున్నాయి. మంగళవారం ఏయే చిత్రాలు ఎలాంటి అప్‌డేట్స్‌తో వచ్చాయో చూసేద్దామా!

‘అఖండ’ పూర్తయింది.. విడుదలే తరువాయి

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘అఖండ’. ప్రగ్యాజైశ్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మంగళవారంతో ‘అఖండ’ షూటింగ్‌ పూర్తయినట్లు చిత్ర బృందం తెలిపింది.  త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని చిత్ర బృందం వెల్లడించింది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతున్నాయి. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ ఇందులో రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.


‘అర్జున ఫల్గుణ’కు కూడా..

వైవిధ్య చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీవిష్ణు. ఆయన కీలక పాత్రలో తేజ మర్ని దర్శకత్వం వహించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ సినిమా షూటింగ్‌ కూడా మంగళవారంతో పూర్తయింది. ‘ఇక అర్జునుడి సమయం మొదలు’ అంటూ పోస్టర్‌ను చిత్ర బృందం పంచుకుంది. త్వరలోనే విడుదల తేదీ కూడా ప్రకటించనున్నారు. ‘అర్జున ఫల్గుణ’ అని ఎవరు తలుచుకున్నారు? మరి అర్జునుడు వచ్చాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


‘పుష్ప’నుంచి మరో సింగిల్‌

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఇందులో ఆమె శ్రీవల్లి అనే పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్‌ను చిత్ర బృందం వెల్లడించింది. ‘శ్రీవల్లి’ అంటూ సాగే పాటను దసరా కానుకగా అక్టోబరు 13న విడుదల చేయనున్నట్లు చిత్ర బృంద ప్రకటించింది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈచిత్రం మొదటి భాగం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.


‘మహా సముద్రం’ శర్వా డబ్బింగ్‌ పూర్తి

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్న రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామా ‘మహా సముద్రం’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శర్వానంద్‌ డబ్బింగ్‌ పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది.


చిట్టెమ్మ.. పుత్తడి బొమ్మ అంటున్న వరుణ్‌ డాక్టర్‌

తమిళంతో పాటు, తెలుగులోనూ అలరిస్తున్న నటుడు శివ కార్తికేయన్‌. నీల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ నటించిన తాజా మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘వరుణ్‌ డాక్టర్‌’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. అక్టోబరు 9న ఈ సినిమాను థియేటర్‌లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ‘చిట్టెమ్మ.. పుత్తడిబొమ్మ’ అంటూ సాగే పాట గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రత్యేకమైన సెట్‌లో తీర్చిదిద్దిన ఈ పాట బాగుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని