Raghavendra Rao: ఏపీ ఆన్‌లైన్‌ టికెటింగ్‌పై దర్శకేంద్రుడి స్పందన

ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ఆన్‌లైన్‌ టికెటింగ్‌పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందించారు. 

Updated : 01 Dec 2021 19:31 IST

హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని ఉద్దేశించి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌ విధానం వల్ల దోపిడీ ఆగిపోతుందనడం సరికాదని ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే థియేటర్ల వల్ల ప్రభుత్వానికి ఎక్కువ పన్ను వస్తుందని చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని దర్శకేంద్రుడు కోరారు. ఇంకా ఆయన ఆ ప్రకటనలో ఏమేం రాశారంటే... 

45 సంవత్సరాల ఇండస్ట్రీలో దర్శకుడిగా, నిర్మాతగా నా అభిప్రాయాలు అర్థం చేసుకోండి. మనం ఎప్పుడూ మూలాల్ని మర్చిపోకూడదు. నేనీ స్థాయిలో ఉండటానికి కారణమైన ప్రేక్షకులు, థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు బాగుంటేనే చిత్ర పరిశ్రమ బాగుంటుంది. ప్రస్తుతం టికెట్లు, సినిమా ప్రదర్శనలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలామంది తీవ్ర నష్టాలకు గురవుతారు. సాధారణ వ్యక్తులకు సినిమా ఒక్కటే వినోదం. ఎలాంటి నేపథ్యమున్న సినిమా అయినా సరే.. వెండితెరపై చూసిన అనుభూతి, టీవీల్లో ఉండదు. షోల సంఖ్య, టికెట్ల ధర తగ్గించటం వల్ల సినిమా వాళ్లు నష్టపోతారు. ఒక హిట్‌ సినిమాకు ఎక్కువ షోలు ప్రదర్శించినా, తొలివారం టికెట్ల ధరలు పెంచినా థియేటర్‌ యాజమాన్యం, వారిని నమ్ముకున్న కొన్ని వేల మందికి 2, 3 నెలలకి సరిపడా ఆదాయం వస్తుంది. ఆ తర్వాత వచ్చే సినిమాలు ఫ్లాప్‌ అయినా... ఇండస్ట్రీ ఇబ్బందిపడదు. 100 సినిమాల్లో 10 శాతం హిట్స్‌ అవుతాయి, మరో 10 శాతం యావరేజ్‌గా నిలుస్తాయి. ఇది అందరికీ తెలిసిన సత్యం. ప్రేక్షకుడు మంచి సినిమా చూడాలనుకుంటే టికెట్‌ ధర రూ. 300 అయినా, రూ. 500 అయినా చూస్తాడు. రూపాయికే సినిమా చూపిస్తామన్నా అతనికి నచ్చని సినిమా చూడడు. పైగా ఆన్‌లైన్‌లో చాలామంది ఇన్‌ఫ్లూయెన్స్‌ ఉన్నవారు బ్లాక్‌ చేసుకుని, వారి శిష్యుల ద్వారా బ్లాక్‌లో అమ్మవచ్చు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేకూర్చాలని ఆశిస్తున్నా

- రాఘవేంద్రరావు

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని