Tollywood: టీఎఫ్‌సీసీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్‌

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరిగే ఈ ఎన్నికల్లో 2023-25 ఏడాదికి గాను నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఓటింగ్‌ ద్వారా ఎన్నుకోనున్నారు.

Updated : 30 Jul 2023 15:28 IST

హైదరాబాద్‌: తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు ముగిశాయి. ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరిగే ఈ ఎన్నికల్లో 2023-25 ఏడాదికి గాను నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఓటింగ్‌ ద్వారా ఎన్నుకోనున్నారు. అధ్యక్ష స్థానానికి నిర్మాతలు దిల్‌ రాజు, సి.కల్యాణ్‌ పోటీపడుతున్నారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ మనుగడ, భవిష్యత్‌ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందిద్దామనే నినాదంతో దిల్‌ రాజు ప్యానెల్‌.. చిన్నసినిమాల మనుగడ, డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జీల తగ్గింపు హామీలతో సి.కల్యాణ్‌ ప్యానెల్‌ బరిలో నిలిచాయి. ఇప్పటికే ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌ నుంచి 16 మంది ఈసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు సహా సుమారు 2వేలకు పైగా టీఎఫ్‌సీసీలో సభ్యులుగా ఉన్నారు. నిర్మాతల సెక్టార్‌ నుంచి సుమారు 1500 మంది, డిస్ట్రిబ్యూటర్ల నుంచి 500, స్టూడియోల నుంచి 98 మంది సభ్యులుగా ఉన్నారు. వారు ఒక్కొక్కరిగా వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకూ క్యూలైన్‌లోఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

సినీ ప్రముఖులు సురేశ్‌బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, రాఘవేంద్రరావు, శ్యాంప్రసాద్ రెడ్డి, సుప్రియ, పోసాని కృష్ణమురళి, బండ్ల గణేశ్‌, జీవిత తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత పలు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కాసేపు నిలిచిపోయింది. ఆ తర్వాత సిబ్బంది ఆ సమస్యలను పరిష్కరించడంతో పోలింగ్  సజావుగా కొనసాగుతోంది. టీఎఫ్‌సీసీ ఎన్నికల నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ ప్రాంగణం సందడిగా మారింది. మధ్యాహ్నం 3 గంటల వరకు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఫిల్మ్ ఛాంబర్‌లో ఫలితాలను ప్రకటించనున్నారు.

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికల తీరుపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విస్మయం వ్యక్తం చేశారు. ఛాంబర్ ఎన్నికలను చూస్తుంటే ఏడవాలో నవ్వాలో అర్థం కావడం లేదన్నారు. సభ్యులు ఎందుకు పోటీపడుతున్నారో తెలియడం లేదన్నారు. ఫిల్మ్ ఛాంబర్ లోపలి వాతావరణం చూస్తే ఫిల్మ్ ఛాంబర్ ఎదిగిందని సంతోషపడాలో లేక సాధారణ ఎన్నికలను తలపిస్తున్నందుకు సిగ్గేస్తుందన్నారు. ఫిల్మ్ ఛాంబర్ సినీ పరిశ్రమలోని అన్ని సెక్టార్స్ కు మంచి చేయడానికి ఉందని, తాను తన తండ్రి ఛాంబర్ కోసం పనిచేశామని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితి భవిష్యత్ లో ఎదురుకావద్దని తమ్మారెడ్డి హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని