Baby: ఆయన నాకు మరో జన్మనిచ్చారు.. వేదికపై కంటతడి పెట్టుకున్న నటి

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్‌ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా వేడుకలో మాట్లాడుతూ వైష్ణవి కంటతడి పెట్టుకుంది.

Published : 13 Jul 2023 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తల్లిదండ్రులు జన్మనిస్తే, దర్శకుడు సాయి రాజేశ్‌ (Sai Rajesh) నటిగా తనకు మరో జన్మనిచ్చారని వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) భావోద్వేగానికి గురైంది. తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ‘బేబీ’ (Baby) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికపై కంటతడి పెట్టుకుంది. ఆమె హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా ఇది. ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా సాయి రాజేశ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించింది.

కొత్త ప్రపంచాన్ని చూశా: వైష్ణవి

‘‘సమాజంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటలనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఈ కథలో ప్రతి ఒక్కరూ లీనమవుతారు. యూట్యూబ్‌ వీడియోలు చేసుకుంటూ ఉండే నా దగ్గరకు ఈ ‘బేబీ’ కథ వచ్చింది. నాకన్నా ఎక్కువగా నన్ను నమ్మి ముందుకు నడిపించారు దర్శకుడు రాజేశ్‌. మెయిన్‌ లీడ్‌గా చేయాలనేదే నా లక్ష్యం. దాని కోసం ఎంతో నేర్చుకున్నా. మధ్యలో సహాయ నటిగా చేశా. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారా. మనల్ని పొగిడేవారుంటారు. విమర్శించేవారూ ఉంటారు. ‘ఈ అమ్మాయి యూట్యూబర్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌. సినిమాలో మెయిన్‌ లీడ్‌ చేయలేదు’ అని చాలామంది అన్నారు. దాంతో, బేబీ అవకాశం నాకు వచ్చినప్పుడు ప్రధాన పాత్ర పోషించగలనా అనే భయం ఉండేది. సినిమా గురించి అన్ని విషయాలు వివరించి, రాజేశ్‌ ధైర్యాన్నిచ్చారు. ఆయన నాకు మరో జన్మనిచ్చారు. ఆయన వల్లే నేనో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా. నిర్మాత ఎస్‌కేఎన్‌ ఎన్ని ఒడిదొడికులు వచ్చినా పట్టించుకోకుండా నన్ను ఓ బేబీలా చూసుకున్నారు’’ అంటూ వైష్ణవి భావోద్వేగానికి గురైంది.

ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘మీ అన్నయ్య విజయ్‌కి మాస్‌ ఇమేజ్‌ వచ్చింది కదా. నువ్వెందుకు అలాంటి కథలు ఎంపిక చేసుకోవట్లేదు. సేఫ్‌ గేమ్‌ ఆడాలనుకుంటున్నావా?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. మాస్‌ అంటే ఏంటని నేను ప్రశ్నిస్తున్నా. ప్రేమలో నిజాయతీ ఉండడమే నా ఉద్దేశంలో మాస్‌. ఆ కోణంలో చూస్తే ‘బేబీ’ మాస్‌ సినిమా. యువతకు బాగా కనెక్ట్‌ అవుతుంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, దర్శకులు మారుతి, వశిష్ఠ, నటుడు సంపూర్ణేశ్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని