Srikanth: నాలుగు రోజుల్లో సినిమా మొదలవుతుందనగా.. శ్రీకాంత్‌ను కాదని రాజశేఖర్‌!

తెలుగు నటుడు శ్రీకాంత్‌కు కూడా తొలినాళ్లలో ఓ సినిమాకు హీరోగా వచ్చిన అవకాశం చేజారిపోయింది. ఆ పాత్రను మరో హీరో రాజశేఖర్‌ చేయడం గమనార్హం.

Published : 25 Jul 2023 10:02 IST

హైదరాబాద్‌: ఏ సినిమా కథ అయినా దానికి తగినట్లు నటీనటులను ఎంపిక చేసుకుంటారు దర్శక-నిర్మాతలు. అనివార్య కారణాలు, పారితోషికాలు, అభిప్రాయ భేదాల కారణంగా మొదట అనుకున్న నటీనటులు కాకుండా కొత్తవారు ఆ పాత్రలు చేయడం సహజం. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్న హీరోలు ప్రతి దాన్ని సదవకాశంగా భావిస్తారు. సినిమా అవకాశం చేజారిపోతే, ఎంతో బాధపడతారు. తెలుగు నటుడు శ్రీకాంత్‌(Srikanth)కు కూడా తొలినాళ్లలో ఓ సినిమాలో హీరోగా వచ్చిన అవకాశం చేజారిపోయింది. ఆ పాత్రను మరో హీరో రాజశేఖర్‌ (Rajasekhar) చేయడం గమనార్హం.

హిందీలో విజయవంతమైన ‘బాజీఘర్‌’ సినిమా హక్కులను చరిత చిత్ర నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. శ్రీకాంత్‌ హీరోగా ‘వేటగాడు’ పేరుతో షిండే దర్శకత్వంలో సినిమా తెరకెక్కాల్సి ఉంది. సినిమాకు సంబంధించిన లుక్‌ టెస్ట్‌ కూడా చేశారు. ఇక హీరోయిన్లుగా సౌందర్య, రంభ నటిస్తున్నారని తెలిసి శ్రీకాంత్‌ సంతోషపడ్డారు. ఏమైందో ఏమో తెలియదు, మరో నాలుగు రోజుల్లో షూటింగ్‌ మొదలవుతుందనగా, శ్రీకాంత్‌ను కాదని రాజశేఖర్‌ను హీరోగా తీసుకున్నారు. షిండే స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం చేయాల్సి వచ్చింది.

‘బ్రో’ కోసం పవన్‌ ఉపవాసం.. 53 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి

కెరీర్‌ తొలినాళ్లలో అలాంటి అవకాశం చేజారిపోయినందుకు తాను చాలా బాధపడ్డానని శ్రీకాంత్‌ కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే, అదే సినిమాలో ఓ చిన్న పాత్రలో శ్రీకాంత్‌ నటించారు. ఆ తర్వాత ‘తాజ్‌మహల్‌’తో మంచి విజయాన్ని అందుకున్న శ్రీకాంత్‌ ‘పెళ్లి సందడి’ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒక దశలో ఏడాదికి 13 సినిమాలు రిలీజ్ చేసే స్థాయికి చేరారు. ప్రస్తుతం ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా శ్రీకాంత్‌ వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని