కేసీఆర్‌ సర్కారుకు కొనసాగే అర్హత లేదు: కిషన్‌రెడ్డి

కేసీఆర్‌ సర్కార్‌ అసమర్థ పాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగానే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దయిందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు.

Published : 24 Sep 2023 04:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేసీఆర్‌ సర్కార్‌ అసమర్థ పాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగానే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దయిందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ‘నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో.. నీళ్లు, నిధుల విషయంలో ఎలాగూ దగాపడుతున్నాం. నియామకాల్లోనూ ప్రభుత్వ వైఫల్యం యువతకు శాపంగా మారింది. దరఖాస్తులు మొదలుకొని హాల్‌టికెట్లపై ఫొటోలు లేకపోవడం, బయోమెట్రిక్‌ స్క్రీనింగ్‌ తొలగించడం ద్వారా పరీక్షల్లో అక్రమాలకు ఆస్కారం కల్పించినట్లయింది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది’ అని కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దుకు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బాధ్యత వహించి రాజీనామా చేయాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్‌ చేశారు. అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. సమగ్ర విచారణ జరిపించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


హైకోర్టు తీర్పు.. ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది: రేవంత్‌రెడ్డి

గ్రూప్‌-1 పరీక్షను మరోసారి నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రికి రాసిన బహిరంగలేఖలో విమర్శించారు. ‘‘ఇంటర్‌ ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో దొర్లిన తప్పులతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2015లో సింగరేణి పరీక్ష మొదలు.. ఎంసెట్‌, విద్యుత్‌ సంస్థ నియామక పరీక్ష, పదో తరగతి, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైనా ప్రభుత్వంలో చలనం లేదు. నిరుడు అక్టోబరు 22న నిర్వహించిన గ్రూప్‌-1(ప్రిలిమ్స్‌) పరీక్షను ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దు చేశారు. లీకేజీకి కారణమైన వారిని శిక్షించలేదు. ఈ ఏడాది జూన్‌ 11న మరోసారి నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోకపోవడం, హాల్‌టికెట్‌ నంబర్లు లేకుండా ఓఎంఆర్‌ షీట్లు ఇవ్వడం వంటి తప్పులకు పాల్పడ్డారు’’ అని లేఖలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

గ్రూప్‌-1 పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి రూ.లక్షన్నర చొప్పున చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కోఛైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల్ని తొలగించాలి: వామపక్షాలు

గ్రూపు-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు కావడానికి టీఎస్‌పీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని వామపక్షాలు ఆరోపించాయి. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులను వెంటనే తొలగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీలో పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు నుంచి నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. తక్షణమే సమర్థŸమైన బోర్డు ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ‘వివిధ ప్రశ్నపత్రాలు లీక్‌ కావడం, సిబ్బంది పాత్ర బయటపడటంతో టీఎస్‌పీఎస్సీ అప్రతిష్ఠ మూటగట్టుకుంది. తర్వాతైనా కమిషన్‌, ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదు’ అని ఆక్షేపించారు. అభ్యర్థులందర్నీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


ప్రభుత్వ వైఫల్యంతోనే పరీక్ష రద్దు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

పెద్దపల్లి, న్యూస్‌టుడే: గ్రూప్‌-1 పరీక్షలను హైకోర్టు రద్దు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, దీనికి సీఎం కేసీఆర్‌ నైతిక బాధ్యత వహించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. పెద్దపల్లిలో శనివారం ఆయన మాట్లాడారు. మూడేళ్లుగా శిక్షణ తీసుకొని పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ రూ.లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులను బర్తరఫ్‌ చేయాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు