WTC Final:పేపర్‌పై ఆస్ట్రేలియా ఫేవరెట్‌.. ఆ విషయంలో మాత్రం భారత ప్లేయర్స్‌ బెస్ట్ : రవిశాస్త్రి

జూన్‌ 7 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య (IND vs AUS) ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో పేపర్‌పై ఆసీస్‌ (Australia) ఫేవరెట్‌గా కనిపిస్తోందని, మ్యాచ్‌ ఫిట్‌నెస్ విషయంలో మాత్రం ఆసీస్‌ ఆటగాళ్ల కంటే టీమ్ఇండియా (Team India) ప్లేయర్స్‌ మెరుగ్గా ఉన్నారని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 

Published : 05 Jun 2023 20:39 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఆసీస్‌ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final) జూన్‌ 7 నుంచి ప్రారంభంకానుంది. లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా ఈ పోరు జరగనుంది. సాధారణంగా ఓవల్‌ పిచ్ పేస్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. దీనికి తోడు ఆస్ట్రేలియాలోని పరిస్థితులే ఇంగ్లాండ్‌లో ఉండటం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం. దీంతో ఈ మ్యాచ్‌లో పేపర్‌పై ఆసీస్‌ (Australia) ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కానీ, మ్యాచ్‌ ఫిట్‌నెస్ విషయంలో ఆసీస్‌ ఆటగాళ్ల కంటే టీమ్ఇండియా (Team India) ప్లేయర్స్‌ మెరుగ్గా ఉన్నారని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి  (Ravi Shastri) పేర్కొన్నాడు. మొన్నటివరకు ఐపీఎల్‌లో ఆడిన భారత ఆటగాళ్లు ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అందుబాటులో ఉంటే టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా కాకపోయినా సమ ఉజ్జీగా ఉండేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
   
“పేస్ బౌలింగ్‌  విషయానికొస్తే.. జస్ప్రీత్‌ బుమ్రా జట్టులో ఉంటే బుమ్రా, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌లతో భారత్‌ ఆసీస్‌తో సమానంగా ఉందని చెప్పేవాడిని. ప్రస్తుతం మిచెల్ స్టార్క్‌, పాట్ కమిన్స్‌లతో ఆస్ట్రేలియా కాస్త బలంగా కనిపిస్తోంది. అయితే, ఇక్కడ మ్యాచ్‌ ఫిట్‌నెస్  కూడా ముఖ్యం. ఇలాంటి మ్యాచ్‌లో ఆడే ముందు ఈ మధ్య కాలంలో కాస్తయినా క్రికెట్ ఆడి ఉండాలి. ఐదు రోజుల పాటు రోజుకు ఆరు గంటల పాటు మైదానంలో ఉండటం వేరు, రెండు గంటల పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం వేరు. భారత్‌కు షమి కీలకం కానున్నాడు. అతడు చాలా క్రికెట్ ఆడుతున్నాడు’’ అని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ విజయం సాధించే అవకాశముందని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్‌ టేలర్ (Ross Taylor) పేర్కొన్నాడు. ఓవల్‌ మైదానంలో చివరి రెండు రోజుల్లో పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా మారుతుందని, ఒకవేళ అలా జరిగితే స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్‌ల మాయతో మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చేస్తుందన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని