Zim vs Ind : స్వల్ప లక్ష్యం.. ఓపెనర్లే ఊదేశారు

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ విజయంతో ప్రారంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై టీమ్‌ఇండియా పది వికెట్ల తేడాతో...

Updated : 18 Aug 2022 19:33 IST

జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం

ఇంటర్నెట్‌ డెస్క్: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ విజయంతో ప్రారంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై టీమ్‌ఇండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 189 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 190 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్‌ (81*), శుభ్‌మన్‌ గిల్ (82*) హాఫ్ సెంచరీలతో జింబాబ్వే బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టీమ్‌ఇండియాను విజయతీరాలకు చేర్చారు. జింబాబ్వే ఎంత శ్రమించినా వికెట్‌ మాత్రం ఇవ్వకూడదనేలా భారత ఓపెనర్లు క్రీజ్‌లో పాతుకుపోయి మరీ పరుగులు రాబట్టారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో రెండుసార్లు పది వికెట్ల విజయాలను భారత్‌ నమోదు చేయడం విశేషం. గత జులైలో ఇంగ్లాండ్‌పైనా ఇలానే పది వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది.  

తొలుత బౌలింగ్‌లో అదరగొట్టి.. 

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ జింబాబ్వే వికెట్లను తీశారు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగిన దీపక్‌ చాహర్ (3/27)తోపాటు ప్రసిధ్‌ కృష్ణ (3/50), అక్షర్‌ పటేల్ (3/24) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. బంగ్లాదేశ్‌పై చెలరేగిన సికిందర్‌ రజా (11), జింబాబ్వే కెప్టెన్‌ చకబ్వా రెగిస్‌ (33)ను కట్టడి చేయడంలో సక్సెస్‌ అయ్యారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. అయితే 110 పరుగులకే ఎనిమిది వికెట్లు పడగొట్టినా.. ఆఖరికి జింబాబ్వే 190 పరుగులను లక్ష్యంగా నిర్దేశించిందంటే దానికి కారణం లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు బ్రాడ్ ఇవాన్స్‌ (33*), ఎన్‌గరవ(34) మాత్రమే. వీరిద్దరూ కలిసి అర్ధశతక భాగస్వామ్యం (70) జోడించారు. వచ్చే మ్యాచుల్లో భారత బౌలర్లు జింబాబ్వే లోయర్‌ఆర్డర్‌పైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని