WTC Final: తొలుత రహానె.. మరోసారి శార్దూల్‌.. సేమ్‌ బౌలర్‌

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final 2023) భారత్‌ ఇన్నింగ్స్‌ను ఆదుకున్న అజింక్య రహానె, శార్దూల్‌ ఠాకూర్‌ను త్వరగా ఔట్‌ చేసే అవకాశాన్ని ఆసీస్‌ వదులుకుంది. రెండుసార్లూ ఒకే బౌలర్‌ కావడం విశేషం. 

Published : 09 Jun 2023 19:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లోనూ (WTC Final 2023) రెండు సంఘటనలు జరిగాయి. బాధితుడు మాత్రం ఒకే బౌలర్‌ కావడం గమనార్హం. ఆసీస్ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు అజింక్య రహానె (89), శార్దూల్ (51) ఠాకూర్‌ ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

వరుసగా వికెట్లను కోల్పోయిన భారత్‌ను రహానె - శార్దూల్ సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. అయితే, కమిన్స్‌ బౌలింగ్‌లో రహానె, శార్దూల్‌ ఇద్దరూ ఎల్బీగా పెవిలియన్‌కు చేరేవారు. కానీ, ఆ రెండు బంతులు కూడా ‘నో బాల్’ కావడంతో బతికిపోయారు. అదీనూ రహానె, శార్దూల్ డీఆర్‌ఎస్‌కు వెళ్లినప్పుడే ఫలితం అనుకూలంగా వచ్చింది. తొలుత రహానె ఇలా డీఆర్‌ఎస్‌తో జీవదానం పొందాడు. రెండో రోజు (గురువారం) భారత ఇన్నింగ్స్‌లోని 22వ ఓవర్‌ చివరి బంతికి ఎల్బీ కోసం కమిన్స్ అప్పీలు చేశాడు. అంపైర్‌ ఔట్‌గా ఇచ్చాడు. కానీ, డీఆర్‌ఎస్‌కు వెళ్లిన రహానెకు ‘నో బాల్’ కలిసొచ్చింది. అప్పుడు రహానె స్కోరు 17 పరుగులు మాత్రమే.

ఇవాళ కమిన్స్‌ బౌలింగ్‌లోనే (59.4వ  ఓవర్‌) శార్దూల్ ఠాకూర్‌కూ ఇలానే జరిగింది. అప్పుడు నాన్‌స్ట్రైకింగ్‌లో రహానె ఉండటం విశేషం. అంపైర్‌ ఔట్‌గా ఇచ్చినా భారత్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లింది. సమీక్షలో ఔట్‌గా తేలినప్పటికీ ‘నో బాల్’కావడంతో నాటౌట్‌గా బయటపడ్డాడు. అప్పుడు శార్దూల్‌ స్కోరు 36 పరుగులు. ఆ తర్వాత హాఫ్ సెంచరీలు సాధించిన వీరిద్దరూ పెవిలియన్‌కు చేరడంతో భారత్ ఇన్నింగ్స్‌ కూడా త్వరగా ముగిసింది. చివరికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 173 మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని