F2 ఇంకా రాలేదు.. F3 తీసుకొస్తారట!

తాజా సమాచారం ప్రకారం ‘ఎఫ్‌ 3’ని తీసుకురావడానికి పోకో సన్నాహాలు చేస్తోందట

Updated : 06 Sep 2022 14:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మూడేళ్ల క్రితం మొబైల్స్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది ‘పోకో ఎఫ్‌ 1’. స్నాప్‌డ్రాగన్‌ ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ 845తో  వచ్చిన ఆ మొబైల్‌ ఇప్పటికీ చాలామంది టెక్‌ నిపుణుల ఫేవరేట్‌. ₹25 వేలలోపు ధరలో హై-ఎండ్‌ స్పెసిఫికేషన్స్‌ ఇస్తుండటంతో చాలామంది ఆ మొబైల్‌ కొనడానికి ఆసక్తి చూపించారు. అంత హిట్‌ కొట్టిన మొబైల్‌కు సక్సెసర్‌గా ‘పోకో ఎఫ్‌ 2’ తీసుకొస్తామని అప్పట్లో ప్రకటించారు. అయితే, వివిధ కారణాల వల్ల ఇంతవరకు ఆ మొబైల్‌ రాలేదు. తాజా సమాచారం ప్రకారం ‘ఎఫ్‌ 3’ని తీసుకురావడానికి పోకో సన్నాహాలు చేస్తోందట. అంటే ‘ఎఫ్‌ 2’ రాకుండానే.. ‘ఎఫ్‌ 3’ని తీసుకొస్తున్నారన్నమాట.

పోకో నుంచి ఇటీవల కాలంలో బడ్జెట్‌ ధర, లో ఎండ్‌ ధరలో మొబైల్స్‌ వస్తున్నాయి. పోకో ఎక్స్‌2, ఎం 2, సీ3, ఎం 3, ఎమ్‌ 2 ప్రో... ఇలా వచ్చినవే. తాజాగా ‘పోకో ఎఫ్‌ 3’ని తీసుకురావాలని బృందం ప్రయత్నాలు చేస్తోందట. ఇటీవల చైనాలో విడుదల చేసిన ‘రెడ్‌మీ కె 40’ మొబైల్‌నే ‘పోకో ఎఫ్‌ 3’ గా తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే ‘కె 40 ప్రో’ని ‘ఎఫ్‌3 ప్రో’గా లాంచ్‌ చేస్తారనే పుకార్లూ వస్తున్నాయి. ‘రెడ్‌మీ కె30’సిరీస్‌ మొబైల్స్‌ వచ్చినప్పుడు కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. ‘కె 30’ని ‘పోకో ఎఫ్‌ 2’ గా తీసుకొస్తారని అన్నారు.. కానీ, జరగలేదు. అయితే ‘రెడ్‌మీ కె 30’ ప్రోను పోలిన మొబైల్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో ‘పోకో ఎఫ్‌ 2 ప్రో’గా తీసుకొచ్చారు. ఆ మొబైల్‌ మన మార్కెట్‌లోకి అయితే రాలేదు. ఇప్పుడు ‘కె 40’ విషయంలో ఏమవుతుందో  చూడాలి. 

ఇక ‘రెడ్‌మీ కె 40’ స్పెసిఫికేషన్లు చూస్తే... 6.67 అంగుళాల సూపర్‌ ఆమోలెడ్‌ స్క్రీన్‌ ఉంటుంది.  క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌  ఉంటుంది. 5జీ సాంకేతికత ఇస్తున్నారు. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌ ఉంటుంది. 48 ఎంపీ మెయిన్‌ కెమెరా కాగా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 5 ఎంపీ మాక్రో కెమెరా ఉంటాయి. ముందువైపు 20 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 4,520 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. బ్యాటరీ ఫుల్‌ ఛార్జి అవ్వడానికి సుమారు గంట పడుతుంది. షావోమికి సబ్‌ బ్రాండ్‌గా మొదలైన పోకో ... ప్రస్తుతం ఇండిపెండెంట్‌ బ్రాండ్‌గా రన్‌ అవుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని